అనంతలో అగ్గిరాజుకుందా..పరిటాల vs గోరంట్ల

-

మాజీ మంత్రి, దివంగతనేత పరిటాల రవిపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పాలక ప్రతిపక్షాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీశాయి. మాధవ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ సీనియర్‌ నేత పరిటాల సునీత.. తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మాధవ్ కామెంట్స్,సునీత వార్నింగ్ ఇప్పుడు సీమలో సెగలు పుట్టిస్తుంది.

అనంతపురం జిల్లా రాప్తాడులో.. రాజకీయ రగడ మొదలైంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌.. మాజీ మంత్రి పరిటాల రవిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. ఎంపీ వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి టీడీపీ శ్రేణులు. దీంతో రెండు పార్టీల మధ్య వార్‌ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, దివంగత మాజీమంత్రి పరిటాల రవిపై.. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఎంపీ గోరంట్ల మాధవ్‌. నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మంది తలలు నరికారనీ… చంద్రబాబు సహకారంతోనే ఎమ్మెల్యేగా ఇలాంటి పనులు చేశారనీ తీవ్ర ఆరోపణలు చేశారు గోరంట్ల. రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాధవ్‌.

రవిపై మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. పరిటాల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారని సునీత గుర్తుచేశారు. నీ చరిత్ర మాకు తెలుసు.. నీలా రోడ్డెక్కి మాట్లాడి మా విలువ తగ్గించుకోలేం. మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ.. మాధవ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు సునీత.

చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ గోరంట్ల మాధవ్‌. బీసీలకు జడ్జి పదవులు ఇవ్వరాదని, జడ్జిలుగా బీసీలు పనికిరారని చంద్రబాబు అన్నారనీ.. మాధవ్ ఆరోపించారు. ప్రత్యేక హోదాను కేంద్రానికి వేలంలో పెట్టి అమ్మేసిన వ్యక్తి చంద్రబాబంటూ మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. దొంగలా అమరావతికి పారిపోయాడంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి గోరంట్ల చేసిన వ్యాఖ్యలు రాప్తాడులో రగడకు కారణమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news