ఏపీ రాజకీయాల్లో దేవుళ్లకు తిప్పలు తప్పడం లేదా

-

అధికార ,ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చోటుచేసుకుంటున్న మాటల యుద్ధాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు వెరసి దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాల దాకా వెళ్ళటం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల నేతలు పోటీపడి మరీ దేవుళ్ళ ముందు సత్య ప్రమాణాలకు దిగడంతో ఇప్పుడు ఏపీలో రాజకీయం దేవుళ్ళకు కూడా తిప్పలు తెచ్చిపెట్టింది.

ఏపీలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చూసుకునే విమర్శలకు, ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలకు మధ్యలో దేవుడ్ని లాగడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. ఏది పడితే అది ఆరోపణలు చేసి తీరా దేవుళ్ళ ముందుకు వెళ్లి సత్య ప్రమాణాలు చేసే రాజకీయాలకు స్వస్తి చెప్పాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బరితెగించి తిట్టుకుంటున్న రాజకీయ పార్టీల నేతలు తమ తీరు మార్చుకోవాలని, ఏ రాజకీయ పార్టీ నేత లైన రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఆలయాలలో సత్య ప్రమాణాలకు దిగటం, భగవంతుడితో ఆటలాడటమేనని మండిపడుతున్నారు.

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన జరిగినప్పట్నుంచీ ఏపీలో ఆలయ రాజకీయం ఊపందుకుంది. ఆ తర్వాత దుర్గగుడిలో వెండి సింహాలు మిస్సింగ్ కూడా కలకలం రేపింది. ఆ తర్వాత కూడా వరుసగా విగ్రహాల ధ్వంసం ఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. అంతర్వేది విషయంలో కాస్త డిఫెన్స్ లో పడ్డ అధికార పార్టీ.. ఆ తర్వాత మాత్రం ఎదురుదాడి మొదలుపెట్టింది. ప్రతి విషయానికీ సీఎంను టార్గెట్ చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని, ఉద్దేశపూర్వకంగానే విగ్రహాలు ధ్వంసం చేయిస్తున్నారవే వాదన తెరపైకి తెచ్చింది.

రాజమండ్రి శ్రీరాంనగర్‌లోని విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. స్వామి ప్రతిమ చేతులు విరిచేశారు. విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లో ఉన్న మోదకొండమ్మ అమ్మవారి పాదుకలను కొందరు ధ్వంసం చేశారు. కొన్నాళ్ల క్రితం ఇదే గుడిలో హుండీ చోరీకూడా జరిగింది. పాదాల ధ్వంసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఏదోచోట దాడులు జరుగుతుండటంతో అటు ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.

రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుమారం రేపింది. చారిత్రక ప్రాధాన్యమున్న రామతీర్థం ఆలయంలో ఇలా జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ప్రతిపక్షా పార్టీలన్నీ మూకమ్మడిగా దాడికి దిగాయి. అటు ప్రభుత్వం కూడా దీటుగా కౌంటరిచ్చింది. ఈ ఘటన చేసిందెవరో ఎంక్వైరీ చేస్తున్నామని, సంఘటన గురించి కూడా తెలియగానే సర్కారు స్పందించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో రామతీర్థం సందర్శించాలని చంద్రబాబు షెడ్యూల్ వేసుకోవడంతో.. రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు రామతీర్థం చేరుకునే లోగానే.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కొండపైకి చేరుకుని గుడిని పరిశీలించడం, ఆయన కారుపై దాడికి దిగిన టీడీపీ శ్రేణులు.. అద్దాలు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

ఏపీలో సాధారణంగా మతాన్ని నమ్ముకున్న రాజకీయం చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అక్కడి ప్రజలు కూడా ఇలాంటి వాటి పట్ల పెద్దగా ఆసక్తి చూపించరని చెబుతారు. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ లేని విధంగా అన్ని పార్టీలూ టెంపుల్ పాలిటిక్స్ నడుపుతున్నాయి. ఏపీ రాజకీయాల గత చరిత్ర తెలిసి కూడా నేతలు ఎందుకు గుడి రాజకీయాల పేరుతో హీట్ పెంచుతున్నారనేది హాట్ టాపిక్ అయింది.టీడీపీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ గుళ్ల కోసం పోరాటాలు చేయలేదు. వైసీపీ కూడా గుడి పేరుతో రాజకీయం చేసిన దాఖలాల్లేవు. కానీ ఈ రెండు పార్టీలు కూడా ఆలయాల్ని హైలైట్ చేస్తూ.. పాలిటిక్స్ చేస్తున్న తీరు విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఏపీలో బలపడాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యూహాత్మకంగా టెంపుల్ పాలిటిక్స్ నడిపిస్తోందనే ఆరోపణలున్నాయి.

ఏపీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఏదో ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టుగా ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమౌతున్నాయి. వీలైనంత త్వరగా నిందితులెవరో పట్టుకోవాల్సిన ప్రభుత్వం, దోషుల అరెస్ట్ కు డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు కూడా.. ఈ ఘటనల్ని పట్టుకుని రాజకీయం పేరుతో మరింత సాగదీసే ప్రయత్నం చేస్తున్నాయి. అత్యంత సున్నితమైన విషయాలని తెలిసి కూడా.. పదేపదే గుళ్లు, దేవుళ్లను వివాదాల్లోకి లాగే ప్రయత్నం జరుగుతోంది. దేవుళ్లు, గుళ్ల పేరు చెప్పి ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టడం లేటెస్ట్ ఫ్యాషన్ గా మారిపోయింది. ఏ ఆరోపణ చేసినా.. ఏదో ఒక గుడి పేరు తీసుకొస్తున్నారు నేతలు. నేతల తీరు చూస్తుంటే.. ఆలయాల్ని భ్రష్టుపట్టించేదాకా నిద్రపోయేలా లేరనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

Read more RELATED
Recommended to you

Latest news