కేసీఆర్ రాజకీయం..పీకేకు కూడా నో ఛాన్స్.!

-

కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే..అన్నీ ఆయనకే తెలుసు అని విధంగానే ముందుకెళ్తారు. ఇతరుల మీద ఆధారపడి వారి సలహాలు తీసుకోవడం, వాళ్ళు చెప్పినట్లు రాజకీయం చేయడం కేసీఆర్‌కు నచ్చని పని. ఆయనకు నచ్చిన విధంగానే రాజకీయం నడవాలి. కానీ ఈ మధ్య దీనికి విరుద్ధంగా కేసీఆర్..ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా నియమించుకున్నారు. అసలు కేసీఆర్ వ్యూహాలే మామూలుగా ఉండవు…ఆయన వ్యూహకర్తని నియమించుకోవడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోయారు.

సరే మొత్తానికి పీకే టీం తెలంగాణలో దిగి పనిచేయడం మొదలుపెట్టింది. కానీ పీకే ఒక్కసారి రంగంలోకి దిగితే..మొత్తం తన కంట్రోల్‌లోకి రావాలని అనుకుంటారు. తాము చెప్పే వ్యూహాలు అమలు కావాలని అనుకుంటారు. కానీ కేసీఆర్ దగ్గర అలాంటిది వర్కౌట్ కాలేదట. మామూలుగానే సొంత పార్టీ లీడర్లకే కేసీఆర్ అందుబాటులో ఉండరని అంటారు. అలాగే పీకే టీంకు కూడా కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదట. పీకే బృందానికి కేసీఆర్‌ సమయం ఇవ్వకపోవడం, వారి వ్యూహాలను వినకపోవడం, విన్నా వాటిని పట్టించుకోకపోవడం లాంటివి జరిగాయట.

దీంతో పీకే టీం ఇప్పుడు..టీఆర్ఎస్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశగా వెళుతుందట. పైగా రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్‌ని గెలిపించాలనేది పీకే టీం చేసుకున్న ఒప్పందం. ఇప్పుడు కేసీఆర్ ఏమో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పనిచేయాలంటే పీకే టీంకు కష్టం. పైగా ఇతర రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీల కోసం పీకే టీం పనిచేస్తుంది.

ఈ కారణాలతో పీకే టీం…టీఆర్ఎస్‌తో ఒప్పందం రద్దు చేసుకునే దిశగా వెళుతుందని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఒప్పందం రద్దు నిజమే అని తేలుతోంది. ఇప్పటికే పీక్..తన ఐప్యాక్ టీంలో కొంతమందిని ఏపీకి పంపించారట..మరికొంతమందిని వేరే రాష్ట్రాలకు పంపించడానికి రెడీ అయ్యారట. మొత్తానికి కేసీఆర్ విధానాల వల్ల పీకే టీం..టీఆర్ఎస్‌కు దూరం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news