ఏపీ పై అటాక్..వ్యూహంలో భాగ‌మేనా ? ఓవ‌ర్ టు కేటీఆర్

-

ఇప్ప‌టికిప్పుడు ప‌క్క రాష్ట్రంతో పోటీ ప‌డీ ఏపీ అభివృద్ధి అన్న‌ది సాధ్యం కాని ప‌ని. ఆ విధంగా చూసుకుంటే అభివృద్ధి విష‌యంలో ఆంధ్రా చాలా అంటే చాలా వెనుక‌బ‌డి ఉంది. సూప‌ర్ స్పెషాల్టీల రూపంలోనూ, ఇంకా ఆధునిక హంగుల‌తో కూడిన స‌చివాల‌య నిర్మాణంలోనూ ఏపీ క‌న్నా టీజీ దూసుకుపోతోంది. అందులో సందేహాల‌కు తావే లేదు. ఏపీ రోడ్ల‌కు సంబంధించి నేషన‌ల్ మీడియా కూడా మాట్లాడింది. ఇప్ప‌టికీ రోడ్లు క‌నీస మ‌ర‌మ్మ‌తుల‌కు నోచుకోలేదు.

అదేవిధంగా క‌రెంటు క‌ష్టాలు గ్రామాల్లో ఉండ‌నే ఉన్నాయి. ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపి వేసి, ప‌ట్ట‌ణాల‌లో కాస్తో కూస్తో ప‌వ‌ర్ క‌ట్స్ అన్న‌వి లేకుండా చూసినా కూడా స‌మ‌స్య‌లు మాత్రం పూర్తి స్థాయిలో ప‌రిష్కారానికి నోచుకోవ‌డం లేదు. నీళ్ల విష‌య‌మే తీసుకుందాం. ఇప్ప‌టికీ గ్రామాల్లో తాగునీటి అవ‌స‌రాలు తీరడం లేదు. ర‌క్షిత మంచి నీటి ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ‌కు క‌నీస స్థాయిలో నిధులు లేవు. అందుకే వీట‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ ఆ మాట చెప్పి ఉంటారు. వీటిని స‌వాలుగా తీసుకుని ఏపీ మంత్రులు ఎందుక‌ని ప‌నిచేయాల‌నుకోవడం లేదు.. అన్న‌దే ఇప్ప‌టి ప్ర‌శ్న ?

ప‌క్క రాష్ట్రం ముఖ్య‌మంత్రి త‌న‌యుడు కేటీఆర్ ఇవాళ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవే ఇప్పుడు పెను సంచ‌ల‌నం అవుతున్నాయి. త‌ప్పేం ఉంది ఇవన్నీ నిజాలే క‌దా అని లోకేశ్ స్పందించారు. గ‌తంలో క‌న్నా ఇప్పుడు ఆంధ్రా అనేక విష‌యాల్లో వెనుక‌బ‌డిపోయింద‌ని అంటున్నారాయ‌న. ఏ విధంగా చూసుకున్నా తాము చేసిన రీతిలో అభివృద్ధి లేద‌న్న‌ది ఆయ‌న వాద‌న. ముఖ్యంగా తాము అధికారంలో ఉన్న‌ప్పుడు అంధ‌కారానికే తావు లేద‌ని చెబుతున్నారాయ‌న. కేటీఆర్ మాట‌లు మ‌రియు మంట‌లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

ముఖ్యంగా ఏపీలో నీళ్లూ, విద్యుత్, రోడ్లు ఈ మూడు బాలేవ‌ని త‌న స్నేహితుడు త‌న‌తో చెప్పార‌ని క్రెడాయ్ మీటింగ్ లో వెల్ల‌డించారు. ఈ విధంగా ఓ రాష్ట్రం లో అతి పెద్ద ఎత్తున నిర్వ‌హించే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు సంబంధించిన మీటింగ్ లో ఏపీని ఉద్దేశించి చెప్పిన మాట‌లలో కొన్ని వాస్త‌వాలున్నాయి అని టీడీపీ అంటోంది. అయితే వైసీపీ ఇదే సంద‌ర్భంలో స్పందిస్తూ త‌మ ప్రాంతాన్ని ఉద్దేశించి కేటీఆర్ స్థాయి మంత్రులు మాట్లాడ‌డం త‌గ‌ద‌ని హిత‌వు చెబుతోంది. హైద్రాబాద్ అభివృద్ధి లో కేసీఆర్ మ‌రియు కేటీఆర్ పాత్ర ఎంత‌న్న‌ది చెప్పాల‌ని మంత్రి సీదిరి సీన్లోకి వ‌చ్చి ప‌ట్టుబ‌ట్టారు.

అదేవిధంగా సీన్లోకి మంత్రి బొత్స కూడా వ‌చ్చి బాధ్య‌త గల వ్య‌క్తులు అలా మాట్లాడ‌డం త‌ప్ప‌ని హిత‌వు చెప్పి వెళ్లారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ తో స‌హా ఇత‌ర పార్టీలు తాము వాస్త‌విక స్థితిగతులు వివ‌రించినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ‌గ్గోలు పెడుతున్నాయి. అప్పులు మాత్రం కుప్ప‌లుగా ఉన్నా క‌నీస స్థాయిలో ఆదాయం పెంపునకు కృషి చేయ‌క‌పోగా, ఎప్ప‌టిక‌ప్పుడు అభివృద్ధి ప‌నుల‌ను మాత్రం బాగానే వాయిదా వేస్తూ వ‌స్తున్నార‌ని మండిప‌డుతోంది. గ్రామీణ ర‌హ‌దారుల అభివృద్ధి బాధ్య‌త తీసుకోవాల్సింది రాష్ట్ర స‌ర్కారేన‌ని, కానీ ఆ విధంగా చ‌ర్య‌లు లేవు అని చెబుతోంది. పెద‌వి విరుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news