ఖమ్మంలోని ఆ మున్సిపాలిటీ అంటే అదిరిపడుతున్న అధికారులు

-

ఖమ్మం పరిధిలోని మున్సిపాలిటీ ఏర్పాటు చేసి 30 నెలలు అయ్యింది. ఇక్కడ తొలిసారి జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగిరింది. ఇంకేముంది. అధికారంలో ఉన్న పార్టీ, కొత్తగా మున్సిపాలిటీ అయింది. అభివృద్దికి హద్దులేదన్న అంత సంబరపడ్డారు. మున్సిపాలిటిలో ఇప్పటికే ఎనిమిది మంది కమిషనర్లు మారారు. ఒకరి తర్వాత మరొకరు..అక్కడికి వస్తున్నారు, వెళ్తున్నారు. మున్సిపాలిటీ పై దృష్టిపెట్టాలంటే మాత్రం అమ్మో అంటున్నారు.

ఖమ్మం జిల్లా వైరా ముప్పై నెలల క్రితం మున్సిపాలిటీగా ఏర్పడింది. అధికారపార్టీనే మున్సిపాలిటిలో విజయం సాధించడంతో ఇక వైరా సమస్యలు తీరినట్లే అనుకున్నారు స్థానికులు. కానీ సీన్ మాత్రం వేరేలా ఉంది. ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన ఇంఛార్జ్‌ కమిషనర్లు పట్టుమని మూడు నెలలు కూడా ఉండలేదు. ఇప్పటికే ఏడుగురు మారిపోయారు. ఇప్పుడు మణుగూరు కమిషనర్‌గా పనిచేసిన వెంకటస్వామి..వైరాకు ఎనిమిదో కమిషనర్‌గా వచ్చారు. ఆయనైనా ఎంతకాలం ఇక్కడ పనిచేస్తారో అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

2018 ఆగస్టులో వైరా మున్సిపాలిటీగా అవతరించినప్పటికీ.. ఇంతకాలం ఇంఛార్జ్‌ కమిషనర్లే ఉన్నారు. పంచాయతీల్లో పనిచేసేవారినే.. మున్సిపాలిటీకి అలాట్‌ చేశారు. అసలు ఇంతమంది మారిపోవడానికి కారణం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడి మున్సిపాలిటీలో ఉద్యోగుల తీరు, రాజకీయాల వల్లే ఎవరూ తమ పని చేసుకోలేకపోతున్నారట. ఇక్కడి వ్యవహారాలను సరిదిద్దడానికి ఓ ఐఏఎస్ అధికారి కూడా ప్రయత్నించి ఆ తర్వాత చేతులు ఎత్తేశారట.

వైరా మున్సిపాలిటిలో 80 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారి కోసం ప్రతి నెలా పది లక్షలకు పైగా ఖర్చు అవుతోంది. ఇంతమంది ఉద్యోగులు.. పెద్ద మున్సిపాలిటీల్లో కూడా ఉండకపోవచ్చు. మరోవైపు ఇక్కడ జరుగుతున్న అభివృద్ది పనుల వ్యవహారంలో కాంట్రాక్టర్లకు, వార్డు సభ్యులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ సమస్యను పరిష్కరించడంలో కూడా ఇంఛార్జ్‌ కమిషనర్లు విఫలమయ్యారు. ఇక రాజకీయాలు సరే సరి. ఇప్పటికైనా వైరా మున్సిపాలిటీ తలరాత మారుతుందో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news