కోదండరామ్‌ ఒంటరి పోరుకి ఆ ఎమ్మెల్యే మద్దతిచ్చారా

-

టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంగా ఉన్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఎప్పుడో నిర్ణయించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కాంగ్రెస్ ఇతర పక్షాల మద్దతు లభిస్తుందని ఆశించారు. కానీ ఎవరికి వారు అభ్యర్ధులను నిటబెట్టడంతో ఒంటరిగానే బరిలో దిగారు ప్రొఫెసర్. అయితే కోదండరాంకి అనూహ్యంగా ఓ ఎమ్మెల్యే నుంచి మద్దతు లభించింది. ఆ ఎమ్మెల్యే మద్దతు వెనకున్న వ్యూహం పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయిన ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు బరిలో దిగడంతో ఓటర్ల నమోదు నుంచి.. ప్రచార వ్యూహం వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. టీజేఎస్ నుంచి బరిలో దిగిన కోదండరాం అసెంబ్లీ ఎన్నికల్లో కుదిరిన అవగాహన మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు విపక్షపార్టీలు మద్దతిస్తాయని భావించారు.చివరిక్షణంలో హ్యాండిచ్చిన కాంగ్రెస్‌ సొంత అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్‌ పోతే పోయింది..కనీసం లెఫ్ట్‌ పార్టీలైనా అండగా ఉంటాయని అనుకుంటే.. ఆ పార్టీలు సైతం సొంతంగా మరో అభ్యర్థిని బరిలో నిలిపాయి. దీంతో ఒంటరి పోరుకు సిద్దమయ్యారు కోదండరామ్‌.

 

ఖమ్మంలో కోదండరామ్‌కు మద్దతు పలికింది న్యూ డెమోక్రసీ. దీంతో ఈ జిల్లాలో ప్రొఫెసర్‌ తరఫున కాస్త ప్రచారం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ తెలంగాణ విభాగం అనూహ్యంగా కోదండరామ్‌కు మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కోదండరాం తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీడీపీకి సానుభూతి పరులు ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలిసి మూడుచోట్ల తెలుగుదేశం పోటీ చేస్తే రెండుచోట్ల గెలిచింది. దీంతో ఈ నిర్ణయం ఆయనకు ఏ మేరకు కలిసి వస్తుందో అన్న చర్చ మొదలైంది.

 

టీడీపీ నుంచి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్లేట్‌ ఫిరాయించినా.. అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. కోదండరామ్‌కు మద్దతిస్తున్నట్టు ఎమ్మెల్యే నాగేశ్వరరావే ప్రకటించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వయంగా టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి మాత్రం అభ్యర్ధిని నిలపలేదు టీ టీడీపీ. ఆంధ్రా పార్టీగా వైరి పక్షాలు చేస్తున్న ప్రచారం తిప్పికొట్టేందుకే టీ టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వడం ద్వారా టీడీపీ ఎమ్మెల్యే ఎంత మేరకు ఉపయోగపడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news