తిరుపతిలో బండి సంజయ్‌ ప్లాన్‌ వర్కవుట్ అవుతుందా ?

-

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో బీజేపీ తన సహజ అస్త్రాలను బయటకు తీస్తోంది. అవి ఎంత వరకు వర్కవుట్‌ అవుతాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తిరుపతి ఉపఎన్నికను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్‌ చర్చకు దారితీశాయి. బైబిల్‌పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలన్నారు..ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ బలంగా ఉన్న సమయంలో సమీకరణాలను ఏ మేరకు బీజేపీ మార్చగలదన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

హైదరాబాద్‌ పాతబస్తీలో తిష్ట వేసిన రోహింగ్యాలు, పాకిస్తానీయులను తరిమికొట్టేందుకు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తామన్న బీజేపీ నేతల ప్రకటన గ్రేటర్ ఎన్నికల్లో ప్రచార వేడిని పెంచింది. నాలుగు నుంచి 46 కార్పొరేటర్లకు బీజేపీ ఎదగడానికి ఆ కామెంట్‌ వర్కవుట్‌ అయిందన్నది కమలనాథుల వాదన. అయితే అదే అస్త్రాన్ని ఏపీలో జరగబోయే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ప్రయోగించి పుంజుకోవాలని బీజేపీ చూసింది. తిరుపతిలో రెండు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తామని ప్రకటించారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు. కానీ ఆ కాపీ అస్త్రం ఇక్కడ పని చేయలేదు. బీజేపీ ఎంపీ ప్రకటనను ప్రజలు పట్టించుకోలేదు. ప్రత్యర్థి పార్టీలు సైతం లైట్‌ తీసుకున్నాయి.

ఏపీ బీజేపీ నేతలు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తిరుపతిలో పెట్టి శోభా యాత్ర నిర్వహించినా పెద్దగా ప్రచారం లభించలేదు. 45 మండలాల్లోని పోలింగ్‌ కేంద్రాల స్థాయిలో 15 మంది రాష్ట్రా నేతలను ఇంచార్జ్‌లుగా పెట్టి తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో జనసేనతో సీటు పంచాయితీ కూడా తేలలేదు. కానీ.. పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉంది బీజేపీ. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తిరుపతి ఉపఎన్నికను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్‌ చర్చకు దారితీశాయి. బైబిల్‌పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలన్నారు సంజయ్‌. ఈ మాటలకు బాగానే ప్రచారం లభించినా.. పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రయిక్స్‌లా తిరుపతిలో ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందన్నది ప్రశ్నగా ఉంది. ఇందుకు రాష్ట్ర రాజకీయాలు.. స్థానికంగా పార్టీల బలాబలాలు కూడా ఒక కారణం.

తిరుపతి లోక్‌సభ అభ్యర్ధిని అందరికంటే ముందు టీడీపీ ప్రకటించింది. వైసీపీ కూడా అభ్యర్థి ఖరారైనా ఇంకా హడావిడి మొదలు పెట్టలేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. అప్పుడెప్పుడో బీజేపీ అభ్యర్ధి గెలిచినా.. మరోసారి రెండోస్థానంలో నిలిచినా ఆ ఓటు బ్యాంకును కమలనాథులు నిలుపుకో లేకపోయారు. 2019 ఎన్నికల ఫలితాలే తీసుకుంటే.. మొత్తం 16 లక్షల ఓటర్లలో వైసీపీకి 7లక్షల 22వేల మంది ఓటేశారు. రెండోస్థానంలో నిలిచిన టీడీపీకి 4 లక్షల 94వేల ఓట్లు దక్కాయి. బీజేపీకి 16వేల ఓట్లే వచ్చాయి. BSPకి మద్దతిచ్చిన జనసేన 20 వేల ఓట్లు రాబట్టుకుంది. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి అని అనుకుంటే.. బీజేపీ, జనసేన కలిసి లక్షల ఓట్లు తమ ఖాతాలో వేసుకోవడం అంత ఈజీకాదు.

ఒకవేళ బీజేపీ కూడా బలం పెంచుకుని.. టీడీపీ గట్టి పోటీ ఇచ్చినా.. అది తమకే ప్లస్‌ అవుతుందన్న ధీమాలో వైసీపీ ఉంది. వైసీపీ ఓటు చీలే అవకాశాలు తక్కువన్నది విశ్లేషకుల మాట. ఏదైనా బీజేపీకి ఓట్లు సెయిల్‌ అవ్వాలంటే టీడీపీ నుంచే రావాలి. లేదా టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించాలి కమలనాథులు. టీడీపీ రెండో ప్లేస్‌లో నిలిచి బీజేపీ థర్డ్‌ వరకు వస్తే ఎవరికి లాభమో కమలనాథులకు బాగా తెలుసు. అదే బీజేపీ రెండో ప్లేస్‌కు చేరుకుని.. టీడీపీ థర్డ్‌ ప్లేస్‌కు వెళ్తే మాత్రం కొత్త సమీకరణాలు ఏపీ రాజకీయ చిత్రంలోకి వస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ఈ స్థాయిలో బీజేపీ తిరుపతిలో పుంజుకోవాలంటే ఏదో మంత్రం వేయాలి. బండి సంజయ్‌ వదిలిన బైబిల్-భగవద్గీత అస్త్రం ఆ మేరకు వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news