ప్రత్యేక హోదా కోసం వైసీపీ పట్టు.. ఈసారి వదిలేది లేదన్న ఎంపీలు

-

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు గడిచిపోయాయి. ఈ పదేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. ఇప్పుడు కూడా ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గడిచిన పదేళ్ళలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎంపీలు కోరుతునే ఉన్నారు. కానీ ఇంతవరకు అలాంటి ఊసే లేదు కేంద్రంలో. అందుకే ఈసారి ఎలాగైనా హోదా సాధించాలని కంకణం కట్టుకుంది వైసీపీ. రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు వైసీపీ ఎంపీలు. నేడు కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో వైసీపీ ఎంపీలు హోదాపై పట్టు పట్టారు. దీంతో మరోసారి ప్రత్యేక హోదా హాట్ టాపిక్ గా మారింది. రెపటినుంచి జరుగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో హోదా నినాదం వినిపించాలని వైసీపీ ఎంపీలు డిసైడయ్యారు. ఏపీలో ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడుల గురించి కూడా వైసీపీ అఖిలపక్షం సమావేశంలో ప్రస్తావించింది.

2019లో 25కి 25 ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలను కోరారు. అయితే కేంద్రంలో బీజేపీకి అప్పుడు స్పష్టమైన మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకి ఇతర పార్టీలపైన ఆధారపడాల్సిన అవసరం రాలేదు. వైసీపీ 22 ఎంపీలను గెలిచినా లాభం లేకుండా పోయింది. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అప్పటి సీఎం జాగన్మోహన్ రెడ్డి హోదా కోసం వినతులు ఇస్తూనే వచ్చారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు.ఇప్పుడు ఏపీలో అధికారంలో లేకపోయినా ప్రత్యేక హోదా కోసం పట్టుపడుతోంది వైసీపీ. ఈ మేరకు జగన్ తన ఎంపీలకు దిశ నిర్దేశం చేశారు.హోదాను సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. అందుకే అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీలు హోదా కోసం తమ స్వరాన్ని వినిపించారు. కూటమి ఎంపీలతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైసీపీ ఎంపీలు పోరాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి.

ఇక ఈ పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ తో పాటు వివిధ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రత్యేక హోదా అంశమే ఈసారి హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. ఏపీ కోసం వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా టాపిక్ లేవనెత్తలని అనుకున్నారు. ఇదే సమయంలో బీహార్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతోంది.ఈ మేరకు ఆర్జేడీ అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేసింది.  అలాగే జేడీయూ కూడా ఒరిస్సాకు హోదా కావాలని డిమాండ్ చేస్తోంది. ఒకేసారి మూడు రాష్ట్రాల హోదా ప్రస్తావన తేవడంతో ఈ సమావేశాలపై ఆసక్తి పేరిగింది. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం. విభజన జరిగిన సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ఈ మూడు రాష్ట్రాలు గుర్తు చేస్తున్నాయి. దీనిపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news