సిద్దిపేట మాజీ కలెక్టర్‌పై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు.. కరుడు గట్టిన సమైక్య వాదంటూ !

-

సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్ రామ్ రెడ్డిపై పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అత్యంత వివాదాస్పద వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డి అని… కేసీఆర్ కి ఈయన ప్రీతి పాత్రుడని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకునే వెంకట్ రామి రెడ్డి గతంలో కుప్పం అభివృద్ధికి పాటు పడిన వ్యక్తి అని ఆరోపించారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడని… ఔటర్ రింగ్ రోడ్డును అష్ట వంకర తిప్పిన అధికారి వెంకట్ రామ్ రెడ్డి అని నిప్పులు చెరిగారు. వైఎస్‌ ను ప్రసన్నం చేసుకుని… శిక్ష నుండి తప్పించుకున్నారని ఆగ్రహించారు.

రోశయ్య హయాంలో ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తాడని… కరుడు గట్టిన సమైక్య వాది… వెంకట్రామిరెడ్డి అని రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని ప్రసన్నం చేసుకుని చిత్తూరు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రచించిన వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డీ అని… రెవెన్యూ శాఖ మంత్రిగా వెంకట్రామిరెడ్డిని నియమించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ ఆదాయం కొల్లగొట్టేందుకు కేసీఆర్… వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కమీషన్లు తీసుకున్నట్లు వెంకట్ రామ్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయని.. చిత్తూరు తాగునీటి పథకం కింద భారీ ఎత్తున కమీషన్లు ముట్టాయని మండిపడ్డారు. ఇప్పటి మంత్రి హరీష్ రావు గతంలో వెంకట్ రామ్ రెడ్డి పై పిర్యాదు చేశాడని గుర్తు చేశారు రేవంత్‌ రెడ్డి. ఇలా తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్‌ పదవులు ఇస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news