వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు గుడ్‌న్యూస్

-

నందమూరి, మెగా అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల స్పెషల్‌ షోలకు అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. విడుదల రోజున ఆరో షోలకు పర్మిషన్‌ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం 12న ఉదయం 4 గంటలకే వీరసింహారెడ్డి షోలు పడనున్నాయి. ఆ మరుసటి రోజే అంటే 13న ఉదయం 4 గంటలకే మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య షోలు ప్రారంభం కానున్నాయి. అంటే ఒక రోజు పాటు ఆరు షోలు పడనున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతి పెద్ద పండగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండగను అత్యంత వేడుకగా జరుపుకుంటారు. అలాగే తెలుగు సినిమాలకు సంబంధించి సంక్రాంతి సీజన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. వరుస సెలవులు ఉండడంతో ప్రేక్షకులు సినిమాలకు క్యూ కడతారు. దీంతో థియేటర్లు కళకళలాడతాయి. ఈ సీజన్‌లో విడుదలయ్యే సినిమాలకు జస్ట్‌ యావరేజ్‌ టాక్‌ వచ్చినా చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే దర్శక నిర్మాతలు సంక్రాంతి సీజన్‌ను టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు విడుదల చేస్తారు. అలా ఈసారి రెండు భారీ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. అవి కూడా మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఇద్దరు బడా హీరోల సినిమాలు.

అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్న ఈ మాస్ ఎంటర్ టైనర్ జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు పోటీగా మెగాస్టార్ కూడా వాల్తేరు వీరయ్యగా బరిలోకి దిగనున్నాడు. ఒక రోజు ఆలస్యంగా అంటే జనవరి 13న థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తుండగా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కే.ఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలోనే రూపుదిద్దికున్నాయి. మరి ఈసారి సంక్రాంతి విజేతగా ఎవరు నిలవనున్నారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news