మా రాజ్యం మా ఇష్టం ! జ‌గ‌న్‌…

-

  • వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల

అమ‌రావ‌తిః న‌న్ను పెంచితే నిన్ను ముంచుతా అనే నానుడిని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ స‌ర్కారు నిజం చేస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య అన్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ… ప‌లు విమ‌ర్శలు గుప్పించారు. ఓట్లు వేసి అధికార పీఠంలో కూర్చొబెట్టిన ప్ర‌జ‌ల‌ను సీఎం జ‌గ‌న్ న‌ట్టేటిలో ముంచుతున్నార‌ని మండిప‌డ్డారు. మా రాజ్యం మా ఇష్టం అనే ధోర‌ణిలో వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతున్న‌ద‌ని ఆరోపించారు.

రాష్ట్రంలోని స‌మ‌స్య‌లు, జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌‌శ్నించే గొంతుక‌లపై జ‌గ‌న్ స‌ర్కారు దాడిచేస్తున్న‌ద‌ని ఆరోపించారు. వైసీపీ నేత‌లు ఇష్టం వచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమ‌ర్శించారు. ‌కాగా, ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు ఆల‌యాల‌పై జ‌రిగిన దాడుల్లో రాష్ట్ర రాజ‌కీయ పార్టీల హ‌స్తం ఉంద‌ని ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు.

గౌత‌మ్ స‌వాంగ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. స‌వాంగ్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన వారిపై త‌ప్పుడు కేసులు బ‌నాయించి.. ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆల‌యాల‌పై దాడులు చేసిన వారిని అదుపులోకి తీసుకోలేని చేత‌గాని స్థితిలో రాష్ట్ర పోలీసు యాంత్రాంగం ఉందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news