తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. ఇటీవల గణతంత్ర వేడుక వివాదం ముగియకముందే బడ్జెట్ విషయంలో మరో వివాదం మొదలైంది. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గవర్నర్ తీరుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు.
వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని కొందరు దెబ్బతీస్తున్నారని గుత్తా, పోచారం విమర్శించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వారు హద్దుల్లో ఉండాలని హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని ఆయన అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
“రాజ్యాంగం కల్పించిన సంస్కృతిని పక్కన పెట్టడం మంచిది కాదు. ఆ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. నేను రాజ్యాంగానికి సంబంధించిన పదవిలో ఉన్నాను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. వక్రబుద్దితో ఆలోచించే నాయకులు అందరికి మంచి జరగాలని, గాంధీజీ వారిని దీవించాలని కోరుతున్నాను. వారికి మంచి బుద్ది వచ్చేలా చూడాలని మరోకసారి మనవి చేసుకుంటున్నాను. ” – గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్