వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కి సంకెళ్లు వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారు – వైఎస్ షర్మిల

-

దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు సంకెళ్లు తప్పడం లేదని బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. “ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ ” అంటే ఇదేనా దొర గారు ? అని ప్రశ్నించారు. నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదంటే బేడీలు వేయడమా మీరిచ్చే బరోసా..? అంటూ నిలదీశారు. మీ బందిపోట్లను ప్రశ్నిస్తే రైతు అని చూడకుండా జైలుకు పంపడమేనా మీ నినాదం ? అని దుయ్యబట్టారు షర్మిల.

“మద్దతు ధర అడిగితే సంకెళ్లు, పంట కొనండని అడిగితే సంకెళ్లు, భూములు పోయాయని అడిగితే సంకెళ్లు, భూములు ఇవ్వం అని చెప్పినా సంకెళ్లు, ఆక్రందన, ఆవేదన, ఆందోళన ఏది చూపినా రైతుకు దొర ఇచ్చే గిఫ్ట్ సంకెళ్లు. కిసాన్ బరోసా అని, వచ్చేది రైతు ప్రభుత్వమని, చెప్పుకొనేందుకు సిగ్గుపడు దొర సిగ్గుపడు. మీది బరోసానిచ్చే సర్కార్ కాదు.. “రైతుకు బేడీలు వేసే సర్కార్”. రైతును బర్బాత్ చేసే సర్కార్. రారాజును తీవ్రవాది గా చూసే సర్కార్. రైతులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించి సంకెళ్లు వేసిన కేసీఆర్ ఒక తాలిబాన్. అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేసిన కనికరం లేని కసాయి ఈ కేసీఆర్.

దేశ చరిత్రలో రైతులను 3 సార్లు జైలుకి పంపిన చరిత్ర నీదే దొర. భూములు పోతున్నాయి మహాప్రభో అని నిరసన తెలిపితే అరెస్టులు చేయిస్తవ ? ట్రిపుల్ఆర్ అలైన్ మెంట్ అన్యాయని అడిగితే జైల్లో పెట్టిస్తవ ? అరెస్ట్ చేయాల్సింది రైతులను కాదు. భూములు మింగే దొర కేసీఆర్ ను. బీఆర్ఎస్ దొంగలకు అనువుగా ట్రిపుల్ అర్ అలైన్ మెంట్ మార్చిన కేసీఆర్ ను జైలుకు పంపాలి. న్యాయమని అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నీ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సంకెళ్లు నీకే వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్” అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news