విద్యుత్ షాక్‌కు గురైన బాలుడికి మంత్రి కేటీఆర్ భరోసా..!

-

హైదరాబాద్: విద్యుత్ షాక్‌కు గురై గాయాలపాలైన నిశాంత్‌కు మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. వైద్య ఖర్చులు భరించి కుటుంబానికి అండగా నిలిచారు. ఏఎస్‌రావు నగర్‌లోని ఈస్ట్ మారుతినగర్‌కు చెందిన నిశాంత్ (8ఏళ్లు) ఆడుకునేందుకు ఇంటి నుంచి కిందికి వెళ్లాడు. అపార్ట్‌మెంట్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడి స్థానికులు, తల్లి జానకీ.. నిశాంత్‌ను ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. నిశాంత్ తండ్రి 2 ఏళ్ల కిందట చనిపోయారు. నిస్సహాయ స్థితిలో ఉన్న నిశాంత్ తల్లి జానకీ సోషల్ మీడియాను ఆశ్రయించింది. తన కొడుకుని కాపాడుకోవడానికి డబ్బులు సాయం చేయమని వీడియో తీసి పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా, ట్విట్టర్‌లో వైరల్ అయింది.

నిషాంత్
నిషాంత్

వైద్య ఖర్చుల కోసం ఆదుకోవాలని తల్లి చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ట్విట్టర్‌లో ఈ వీడియోపై పలువురు స్పందించారు. అలాగే ఈ వీడియోను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు చెప్పి.. నిశాంత్ బాగోగులు తెలుసుకోమని ఆదేశించారు. అలాగే ఆ బాలుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అంకూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిశాంత్‌ను కలిశారు. బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడి భరోసా కల్పించారు.

నిశాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే మైనంపల్లి ఆరాతీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. మెరుగైన వెద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. నిషాంత్ చికిత్సకు ఎంత ఖర్చయినా తానే భరిస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హామీ ఇచ్చారు. బాలుడి బాగోగులు తెలుసుకున్న తర్వాత మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి పిల్లాడి గురించి తెలిపారు. అనంతరం.. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నా.. విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని మండి పడ్డారు. మల్కాజిగిరి సర్కిల్‌లో ఉన్న అన్నీ ట్రాన్స్‌ఫార్మార్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news