మహారాష్ట్ర ప్రజలు “థు” అని మీ మొహం మీద ఊయడానికి రెడీగా ఉన్నారు – వైఎస్ షర్మిల

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మందిసొమ్ము ముప్పొద్దులా మెక్కే ముదనష్ఠపు స్వభావం ఎవరికైనా ఉంది అంటే, అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అయన అవినీతి చెంచాలు అని చెప్పుకోవాలని తీవ్ర విమర్శలు చేశారు. అసలు ప్రజల రక్తాన్ని, కష్టాన్ని ఎంతగా పీక్కుతినాలో వీరి నుండి నేర్చుకోవాలన్నారు.

“సీఎం గారు, మీ దిక్కుమాలిన దేశ రాజకీయాల కోసం తెలంగాణ డబ్బును ఎంత నిస్సిగ్గుగా వాడుతున్నారో అసలు సోయ ఉన్నదా మీకు? మహారాష్ట్రలో అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరుగుతున్న భారస ఎమ్యెల్యేలు, ఆ ఖర్చులను తెలంగాణ ఖాతాలో జమచేస్తరా? కేసీఆర్ తిరిగే టీఎస్సార్టీసీ బస్సు మొదలుకొని మంత్రులు, ఎమ్యెల్యేలు తెలంగాణ సర్కారీ బండ్లు మహారాష్ట్రలో తిప్పుతారా? ఆ బస్సులు, బళ్ళు తెలంగాణ ఆస్తులు, తెలంగాణ ప్రజల కష్టార్జితం, వారి మీద వేసే పన్నులతో కొన్నవి.

ఏ హక్కు, నైతికతతో వాటిని మహారాష్ట్రలో నడుపుతారు ఈ దుర్మార్గ భారాస నాయకులు? తొమ్మిదేండ్లల్ల 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచి, కాళేశ్వరంతో లక్షన్నర కోట్ల కమిషన్లు బొక్కి, ఇవి చాలవన్నట్టు ఇసుక, గనులు, గ్రానైటు, భూములు అన్నింటిని అడ్డగోలుగా దోచుకున్న బందిపోటు రాక్షస సమితి నేతలు, చివరికి ప్రభుత్వ పథకాల్లో కూడా కక్కుర్తిగా కమిషన్లు బొక్కుతున్నారు. ఇప్పుడు ఇవనీ చాలవన్నట్టు ఈ 30 పర్శంట్ కమిషన్ బాబులు రాష్ట్ర ఆస్తులను పక్కరాష్ట్రంలో వీరి డాబులకోసం బరితెగించి వాడుకుంటున్నారు.

అసలు మీరు తినేది అన్నామా, గడ్డినా, మీకే తెలుస్తున్నదా? భారాసా జలగల్లారా, ఇంకెంత తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి బలుస్తారు. సిగ్గుంటే, కొంచమైనా నీతి అనేది మీలో ఇంకా మిగిలి ఉంటే, సరిహద్దు దాటాక తెలంగాణ బండ్లను, ఆస్తులను అక్కికక్కడే వదిలి, మహారాష్ట్ర బళ్లను వాడండి. మీ చెత్త రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు నిరాకరించారు, థూ అని మొహం మీద ఊయటానికి రెడీగా ఉన్నారు. మరి ఈ పరిస్థితిల్లో మీకు ఈ డ్రామాలు అవసరమా? మరికొన్ని దినాలలో మీ సర్కారుకు తెలంగాణ ప్రజానీకం బొందపెట్టపోతోంది. ఓటుతో మీ ఆటలు కట్టించడానికి ప్రజలు రెడీ” అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news