ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో నాలుగోరోజు ప్రశ్నోత్తరాల తో ప్రారంభమయ్యాయి. ముందుగా టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పప్పులు నిప్పులయ్యాలని..వంట నూనె, కూరగాయల ధరలు చుక్కలంటాయని..వీటిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవన్నీ చాలనట్టు ఇటీవలే ఆర్టీసీ చార్జీలు కూడా పెంచారని ఆమె గుర్తు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి.. టీడీపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉందని విమర్శించారు. ఇక ఆరు నెలలకు ముందు ఉన్న ధరలు.. ఇప్పుడు ధరలను కూడా ఆమె చదివి వినిపించారు. ఇక కందిపప్పు గతంలో రూ.72 ఉండగా..ఇప్పుడు 110 అయిందని..వేరు శనగలు అప్పుడు రూ.98 ఉండగా ఇప్పుడు రూ.120 అయ్యాయని.. ఉల్లి అయితే ఏకంగా రూ. 40 నుంచి, రూ 120 కు వెళ్లిందని ఆమె పేర్కొన్నారు.
ఆదిరెడ్డి భవానీ ప్రశ్నలకు పౌరసరపరాల శాఖా మంత్రి కొడాలి నాని సమాధానం ఇచ్చారు. ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని… వాటిని ధరల పెరుగుదలగా పరిగణలోకి తీసుకోరని చెప్పారు. ఈ సందర్భంగానే ఆయన పప్పుల రేట్లు గురించి మాట్లాడుతుండగా.. ఆయన వెనక ఉన్న వైసీపీ సభ్యులు ఏ పప్పు అని సరదాగా వ్యాఖ్యానించగా… అప్పుడు నాని ఆ పప్పు కాదు లెండి… కందిపప్పు అండి ఆన్సర్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఇక వైసీపీ వాళ్లు నారా లోకేష్ను పప్పు అని విమర్శించడం అందరికి తెలిసిందే. ఇప్పుడు నాని కూడా లోకేష్ పేరు ఎత్తకపోయినా పరోక్షంగా ఆ పప్పు కాదు… కందిపప్పు అని చమత్కరించారు.