ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ..ట్రంప్ సుప్రీంకి వెళ్తే ఎమౌతుంది…?

-

ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టుకెళతాం..ఆ కౌంటింగ్‌ను ఆపేయాలని కోరతాం..అయితే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ట్రంప్ కామెంట్స్ పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. జిల్లా, రాష్ట్ర కోర్టులకు వెళ్లే వీలున్నా… వాటిని కాదని ఏకంగా ఎందుకని సుప్రీంకోర్టుకే వెళతానని అన్నారు..? సుప్రీంకోర్టుకెళితే ఏమౌతుంది?

అమెరికాలో ఎన్నికల ఫలితాలపై కోర్టుకెళ్లటం మామూలే. అయితే, అది స్థానిక కోర్టుల నుంచి మొదలై… రాష్ట్రస్థాయి నుంచి సుప్రీందాకా చేరుతుంది. చాలా కేసులు స్థానికంగానే తేలిపోతాయి. కానీ, ఈసారి ట్రంప్‌ ఏకంగా సుప్రీంకోర్టులోనే వీటిపై కేసు వేయటానికి సిద్ధమవటానికి కారణం లేకపోలేదు. చాలా రాష్ట్రాల్లో భారీస్థాయిలో పోస్టల్‌ ఓట్లు నమోదయ్యాయి. పైగా స్థానిక నిబంధనల ప్రకారం.. కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం నాటి ఓటింగ్‌ పూర్తయ్యాక కూడా ఓట్లను స్వీకరించటానికి అవకాశం ఉంది. దీంతో… అవకతవకలకు ఆస్కారం ఉందని… వాటిని ఆపేయాలని రిపబ్లికన్‌ పార్టీ ముందు నుంచి కోరుతోంది.

పెన్సిల్వేనియాలో మంగళవారం తర్వాత ఓట్లు భారీగా వచ్చి చేరుతున్నాయని… కొన్ని జిల్లాల్లో పోస్టల్‌ ఓట్లను వేసిన తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయ్‌. ఫలితం తేలకుండా మిగిలిన కీలక రాష్ట్రాల్లో పెన్సిల్వేనియాలో అత్యధికంగా 20ఎలక్టోరల్‌ ఓట్లున్నాయి. అక్కడ ప్రస్తుతం ట్రంప్‌ భారీ మెజార్టీతో ఉన్నారు. కానీ… ఇంకా 10 లక్షలకుపైగా పోస్టల్‌ ఓట్లు లెక్కించాల్సి ఉందని… భారీ మెజార్టీకి అవకాశమున్న ఈ ఓట్లను జాగ్రత్తగా తొందరపడకుండా లెక్కిస్తామని అక్కడి డెమోక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్‌ ప్రకటించారు. ఈ పోస్టల్‌ లెక్కింపు ఫలితాన్ని తారు మారు చేస్తుందేమోననేది రిపబ్లికన్‌ల ఆందోళనగా తెలుస్తుంది.నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ ఓట్లపై, లెక్కింపుపై అనుకూల తీర్పు తెచ్చుకోవాలని ట్రంప్‌ వర్గం భావిస్తోంది. 2000సంవత్సరంలో జార్జ్‌బుష్‌ జూనియర్‌ ఎన్నిక కూడా ఇలాగే నువ్వానేనా అన్నట్లు సాగి చివరకు సుప్రీంకోర్టులో తేలింది. అక్కడ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి బుష్‌నే విజయం వరించింది.

Read more RELATED
Recommended to you

Latest news