ఏపీ లోకల్‌ ఫైట్‌ ఎలాంటి మలుపు తిరగబోతోంది ?

0
12

ఏపీలో పంచాయతీ ఎన్నికలపోరు ఎలక్షన్ జరగకుండానే టెన్షన్ పుట్టిస్తుంది. ప్రభుత్వం చూస్తే ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కష్టమని సుప్రీంకు వెళ్లింది. ఇటు చూస్తే ఈసీ ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో క్షణ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పెద్ద ప్రహననంగా మారింది. ఒకరు వద్దంటే.. మరొకరు కావాలంటూ పంతాలకు పోవడంతో ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం దీనిపైనే ఫోకస్‌ అయినట్టు కనిపిస్తోంది. ఈసీ – సర్కార్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ తొలివిడత నోటిఫికేషన్‌ ఇచ్చేసింది ఎస్ఈసీ. మరోవైపు తాజా ఓటర్ల జాబితాను సిద్దం చేయకపోవడంపై పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తీరును ఎస్ఈసీ తప్పుబట్టింది.

నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ఏం జరిగినా బాధ్యత మొత్తం ప్రభుత్వానిదేనని, మూల్యం చెల్లించుకోవాలని కామెంట్‌ చేశారు. అయితే ఎస్ఈసీ ఈ వ్యాఖ్యల తర్వాత ప్రభుత్వం వైపు నుంచి, ఉద్యోగాల సంఘాల నుంచి సీరియస్‌ రియాక్షన్సే వచ్చాయి. ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోరని స్వయంగా పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ప్రకటించారు. మరోవైపు, అవసరమైతే ఎన్నికల విధుల్ని బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు ఉద్యోగ సంఘాల నేతలు.

మరోవైపు, నామినేషన్లను స్వీకరించే దగ్గరి నుంచి ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన వరకు పని చేయాల్సింది మండల స్థాయి అధికారులే. సీఎస్సే ఎన్నికలు వద్దంటున్నప్పుడు ఇక మండల, గ్రామ స్థాయి అధికారులు ఎంత వరకు సహకరిస్తారన్నది అనుమానమే. ఇది ముందే ఊహించారో ఏమో కానీ ప్రెస్‌మీట్‌లోనే ఈ పరిస్థితికి పరిష్కారం ఏంటన్నది కూడా క్లారిటీ ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243-K ప్రకారం ఎస్ఈసీకి సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని, దాన్ని ఇప్పటికే హరిచందన్‌కు వివరించానని నిమ్మగడ్డ చెప్పారు.

అధికారులు రమ్మంటే రాలేదు, వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడు నిమ్మగడ్డ ముందున్న ఆప్షన్‌ గవర్నర్‌, లేదంటే హైకోర్టు. ముందు గవర్నర్‌ దగ్గరకే వెళ్లి ప్రభుత్వాన్ని ఆదేశించేలా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను హైకోర్టుకు వివరించి ఒక డైరెక్షన్‌ ఇప్పించే ఛాన్స్‌ కూడా ఉంది. ముందు గవర్నర్‌ దగ్గరకు వెళితే ఆయన ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు లోకల్‌ ఎన్నిలపై అత్యవరసర విచారణ జరపాలంటూ దాఖలు చేసిన ఏపీ సర్కార్‌ పిటిషన్‌ సోమవారం సుప్రీం ముందుకు రాసుంది.