చంద్రబాబు సొంత గ్రామం పై ఫోకస్ పెట్టిన వైసీపీ

-

పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అధికార, విపక్ష పార్టీల ఎత్తుగడలు ఆసక్తిగా ఉన్నాయి. టీడీపీకి బలంగా ఉన్న గ్రామాల్లో పాగా వేయాలని అధికారపార్టీ వైసీపీ పావులు కదుపుతుంటే.. పట్టుకోల్పోకుండా ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలు.. చర్చ పల్లె రాజకీయాలను రసకందాయంలో పడేస్తున్నాయి. చిత్తూరులో భారీ గెలుపు సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు చంద్రబాబు స్వగ్రామంపై ఫోకస్‌ పెట్టింది.

చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజవర్గంలో పంచాయతీ ఫలితాలు టిడిపి, వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారాయి. మూడో దశ ఎన్నికల్లో కుప్పంలో 89 పంచాయతీల్లో 75 వైసీపీ గెలిస్తే, టిడిపి కేవలం 13 మాత్రమే గెలిచింది. ఈ షాకింగ్‌ పలితాలు రెండు పార్టీలనూ ఆశ్చర్యంలోనే పడేస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి 13 చోట్లకే పరిమితం కావటం చూసిన చిత్తూరు జిల్లా తమ్ముళ్ళు, టిడిపి అధినేత అవాక్కయ్యారట.

అయితే కుప్పం షాక్‌ నుండి తేరుకోకముందే, మరో పెద్ద తలనొప్పి వచ్చిపడిందని మరింత ఆందోళనకు గురవుతున్నారట టీడీపీ నేతలు. చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లె ఈ ఆందోళనకు కారణంగా మారింది. ఆరు నూరైనా నారావారి పల్లెలో గెలవాల్సిందేనని లేదంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు.

టీడీపీ అధినేత చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ వైసీపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి..టీడీపీ అధినేత ఇలాకలో వైసీపీ జెండా రెపరెపలాడించి పార్టీ అధిష్ఠానం దగ్గర మార్కులు కొట్టేసే ఆలోచన చేస్తున్నారట. అదే జరిగితే ప్రమోషన్‌ కూడా వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. చంద్రగిరిలో గెలిచిన సర్పంచ్ లకు జరిగిన సన్మానసభలో డిప్యూటీ సిఎంనారాయణస్వామి, పెద్దిరెడ్డి మొదలైన నేతలు హాజరైన సమయంలో ఇదే చర్చ సాగిందట. కుప్పం తరహాలోనే నారావారిపల్లెలోనూ వైసీపీ జెండా ఎగురవేయాలంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణుల పోస్టులు రచ్చ చేస్తున్నాయి.

కందులవారిపల్లి పంచాయతీ మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా ఉంది. ఇప్పటి వరకు ఆ పార్టీ మద్దతుదారులు ప్రభాకర్ నాయుడు, బెనర్జీ నాయుడు, చంద్రకుమార్ నాయుడులే సర్పంచ్‌లుగా కొనసాగారు. మొదటి నుంచి టీడీపీ పాగా వేస్తున్న కందులవారిపల్లి పంచాయతీని కైవసం చేసుకునేందుకు వైసీపీ ఫోకస్ పెట్టింది. 650 ఓట్లతో అతి చిన్న పంచాయతీగా ఉన్న కందులవారిపల్లికి పక్కనున్న నారావారిపల్లె, శేషాపురం, బి.కొంగరవారిపల్లి పంచాయతీలను కలిపి 1404 ఓట్లతో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వైసీపీ ఎస్సీ మహిళకు అవకాశం ఇస్తే..టిడిపి ఓసి మహిళను రంగంలో దింపారు. దీనిఫలితం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకూ చంద్రగిరిలో ఎన్నకలు జరిగిన అన్ని పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరటంతో, తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. గతంలో కూడా ఇక్కడ ఎంపీటిసి సీటును పోగొట్టుకున్నారు తమ్ముళ్ళు. ఇప్పుడు పంచాయతీ చేజారితే పరిస్థితి ఎంటో అనే ఆందోళన టీడీపీలో టెన్షన్ పుట్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news