ఇటీవల వైఎస్సార్సీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ సీపీ శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగించాలని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్మానం పై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశంలో రాజకీయ పార్టీలకు కొన్ని నిబంధనలు ఉంటాయని, వాటి మేరకు నడుచుకుంటామని పార్టీలు ముందే అంగీకార పత్రం ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఇస్తానురీతిగా వ్యవహరిస్తాం అంటే కుదరదని, ఇదే విషయమై తాను ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
ఒకవేళ రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ అంగీకరిస్తే.. అన్ని పార్టీలకు జగన్ మార్గదర్శిగా నిలుస్తారని అన్నారు. మరో పాతికేళ్లపాటు ముఖ్యమంత్రి జగనే అని వైసీపీ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసినా ఆశ్చర్యం లేదని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు. ఇక తన గురించి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ను, ఆ భాషను చూసిన ప్రజలు మళ్లీ వైసీపీకి ఓటు వేయరని రఘురామా అన్నారు.