ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే.. ఏ పూల మొక్కలు ఏ దిశలో నాటాలో తెలుసా..?

-

ఇంట్లో పూల మొక్కలు ఉంటే ఎంతో అహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇల్లు అందంగా కనిపించడమే కాదు మానసిక ఆనందాన్ని కలుగజేస్తాయి. మరోవైపు ఈ పూలు పూజకు కూడా ఉపయోగపడతాయి. ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే అవి ఇంట్లో ప్రశాంతతను నెలకొల్పుతాయట. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ పూల మొక్కలు ఉండకూడదు. వాస్తు ప్రకారం పూల మొక్కలు నాటితే ఇంట్లో ప్రశాంతత వెల్లివిరుస్తుందట. మరి ఏ మొక్కలను ఏ దిక్కులో నాటాలో చూద్దామా..!

మందార పువ్వు:

ఎరుపు రంగు మందార పువ్వును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పువ్వులు దుర్గ అమ్మవారికి, గణేశుడికి సమర్పిస్తారు. వాస్తు ప్రకారం.. ఇంట్లో సానుకూలతను తీసుకురావడానికి ఈ పూల మొక్కలను నాటడం మంచిది. ఈ మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. ఈ మందార పువ్వులను మంగళవారం హనుమంతుడికి కూడా సమర్పించవచ్చు. ఎరుపు మందార పువ్వును సూర్య భగవానుడి పూజలో కూడా ఉపయోగించవచ్చు.

తామర పువ్వు:

తామర పువ్వు లక్ష్మీ దేవి, బుద్ధ భగవానుడికి మంచి సంబంధం ఉంది. ఈ పువ్వును ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణిస్తారు. తామర మొక్కను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్కను నాటడం చాలా శుభప్రదం. ఈశాన్య లేదా ఉత్తరం లేదా తూర్పు దిశలో తామర పువ్వు మొక్కలను నాటడం శ్రేయస్కరం.

బంతి పూలు:

పూజలో ఎక్కువగా పసుపు రంగులో ఉండే బంతి పువ్వులను ఉపయోగిస్తారు. ఇవి అదృష్టానికి, ఆశావాదానికి చిహ్నం. పసుపురంగు బంతిపువ్వులు జీవితంలో అదృష్టాన్ని తెస్తాయని నమ్మకం. దీపావళి వంటి సందర్భాలలో ఇంటిని అలంకరించుకోవడానికి ప్రజలు బంతి పువ్వులను కూడా ఉపయోగిస్తారు.

గులాబీ పువ్వులు:

ఈ పువ్వు ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తాం. ఇంట్లో గులాబీ పూల మొక్కలు నాటితే ఇంటికి అదృష్టం వరిస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ మొక్కలను నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తాయి.

సంపంగి పువ్వులు:

సంపంగి పువ్వులు చాలా అందంగా ఉంటాయి. లేత పసుపు, తెలుపు, ఆకు పచ్చ రంగులో ఉంటాయి. వీటిని తరచుగా పూజలో ఉపయోగిస్తారు. ఈ పూల మొక్కలు నాటితే ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో పాటు ఇంటి సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారట.

 

Read more RELATED
Recommended to you

Latest news