‘భారత్‌లో తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి’

-

ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు చనిపోయారు.. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు కారణమని ఉజ్బెకిస్తాన్‌ అంటోంది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలలో 18 మంది నోయిడాకు చెందిన మారియన్‌ బయోటెక్‌ తయారు చేసిన డాక్‌-1 మాక్స్‌ దగ్గు మందు తాగి మృతిచెందారంటూ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సిరప్‌లపై నిర్వహించిన ల్యాబరేటరీ పరీక్షల్లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నట్లు తెలిపింది.

వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా…

పిల్లలు ఆసుపత్రిలో చేరక ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, తల్లిదండ్రులు లేదా ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు అధిక మోతాదులో జలుబును తగ్గించేందుకు పిల్లలకు అందించారు. 2.5- 5 ఎంఎల్‌ మోతాదుతో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు 2-7 రోజుల పాటు ఈ సిరప్‌ను తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 18 మంది పిల్లలు మరణించడంతో దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్ -1 మాక్స్ టాబ్లెట్లు, సిరప్‌లను నిషేధించారు. 2012లో మారియన్ బయోటెక్‌ ఉజ్బెకిస్తాన్‌లో రిజిస్టర్ చేసుకుంది.

భారత్‌ ఏం అంటోంది..

భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉజ్బెకిస్తాన్‌ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత్‌ రెడీ అయింది. ఉజ్బెకిస్తాన్‌ ప్రకటన తమ దృష్టికి వచ్చిందని.. దీనికి సంబంధించిన వివరాలను తమకు అందించాలని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. అయితే ఈ సిరప్‌ను ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) వర్గాలు తెలిపాయి. అదే విధంగా ఈ ఘటనపై సీడీఎస్‌ఓ-నార్త్ జోన్, ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి.

మారియన్‌ బయోటెక్‌ కంపెనీ ఏం అంటోంది..

ఉజ్బెకిస్తాన్‌లో పిల్లల మరణాల పట్ల చింతిస్తున్నామని మారియన్ బయోటెక్ ఫార్మా కంపెనీ తెలిపింది. తయారీ యూనిట్‌ నుంచి దగ్గు మందు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం విచారణ జరుపుతోందని, పూర్తి నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ లీగల్ హెడ్ హసన్ రజా వెల్లడించారు.

గతంలో కూడా..

భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లపై ఆరోపణలు రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆఫ్రికన్‌ దేశమైన గాంబియాలో 70 మందికి పైగా పిల్లలు మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారైన దగ్గు మందు సిరప్‌ కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి.. పిల్లల మృతిపై కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని, వీటిని వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే ఉబ్జెకిస్తాన్‌, గాంబియాలోనూ చిన్నారుల మరణాలకు సిరప్‌లో ప్రాణాంతక రసాయనం ఇథిలీన్ గ్లైకాల్‌ ఉండటమే కారణమవడం గమనార్హం..

Read more RELATED
Recommended to you

Latest news