కరోనా కోసం రైతు 50 వేల సహాయం…!

-

దేశంలో ఎక్కడ చూసినా కరోనా భయం ప్రజలను వెంటాడుతుంది. కేంద్ర ప్రభుత్వం కరోనా ను అరికట్టడానికి దేశంలో అన్ని రాష్ట్రాల లోనూ లాక్ డౌన్ ప్రకటించింది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకీభవించాయి. దేశంలో ఎక్కడ కూడా ప్రజలు అడుగు బయట పెట్టే పరిస్థితులు లేవు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసిఆర్ కరోనా తీవ్రతను గురించి ప్రజలకు అవగాహన కలిగేలా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి తెలంగాణలో 41 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక దేశం మొత్తం మీద చూస్తే కరోనా బాధితుల సంఖ్య 650 పై మాటే. అయితే ఈ వైరస్ నివారణకు ప్రజలు కూడా తమ వంతు కృషి చేసి ప్రభుత్వాలకు సహాయ పడుతున్నారు. దీన్లో భాగంగా కొందరు ప్రముఖులు తమ వంతు సహాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్రకటిస్తున్నారు. అయితే మేము సైతం అంటూ సామాన్య ప్రజలు కూడా తమ వంతు సహాయాన్ని అందించడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. తాజాగా ఓ సామాన్య రైతు తన వంతు సహాయంగా యాబై వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు.

అతనేమి ఎక్కువ ఏకరాలు కలిగిన ఆసామి అనుకుంటే పొరపాటే అతనికి ఉన్నది నాలుగు ఎకరాలు పొలం మాత్రమే. అయితే కరోనా వైరస్ ప్రభావం తో దేశం కష్టాన్ని ఎదుర్కొంటున్న విషయం తన పిల్లల ద్వారా తెలుసుకొని తన వంతుగా సహాయం చేసేందుకు ఆ రైతు ముందుకు వచ్చాడు. ఆదిలాబాద్ జిల్లా లాండసాంగి గ్రామానికి చెందిన మోర హన్మాండ్లు బుధవారం (మార్చి 25)న తమ జిల్లా కలెక్టర్ దేవసేనను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన రూ.50,000 చెక్కు అందజేశారు.. ఇప్పుడు ఈ యాబై వేల రూపాయలను ఇవ్వడం తన ఆర్థిక పరిస్తితి దృష్ట్యా తనకి కష్టమే.

కానీ తనని చూసి మరికొందరు ముందుకు వస్తారని దేవుడు చల్లగా చూసి కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుంటాననీ ఆ రైతు గర్వంగా చెపుతున్నాడు. ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నానని ఏ మాత్రం స్వార్థం లేకుండా హన్మండ్లు చెపుతుంటే ఆ మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తాయి. డబ్బులు ఉండి ఏం జేస్తయి సార్ పనికొస్తయా? మనం చచ్చిపోతే డబ్బులు ఏం జేస్తయ్ నా వంటివాళ్ళు సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతూన్నాని హాన్మండ్లు కోరుతున్నాడు. సహాయం చెయ్యడానికి కావల్సింది ఆస్తి పాస్తులు కాదు ఆదుకునే హృదయం అని హాన్మండ్లు ను చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news