క్లాస్ రూమ్ లోనే విద్యార్థినికి అబార్షన్.. యువతి మృతి

-

నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థిని అబార్షన్‌ కారణంగా తరగతి గదిలోనే మృతి చెందింది. ఈనెల 11న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11న కళాశాల విద్యార్థులందరూ గ్రౌండ్​లో ఉండగా.. యువతి ఒక్కరే గదిలో ఉండి తలుపులకు గడియ పెట్టుకున్నారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా తరగతి గదిలోనే తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉండగా.. పక్కనే ఆరు నెలల పిండం ఉంది.

తోటి విద్యార్థులు హుటాహుటిన తల్లిని, పిండాన్ని ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నెల్లూరుగ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తరగతి గదిలోనే అబార్షన్‌ అయ్యిందా? లేదా వీడియో ద్వారా తనకు తానే అబార్షన్‌ చేసుకుందా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news