రైతుల పాదయాత్ర అనుమతి రద్దుపై విచారణ రేపటికి వాయిదా

-

అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పాదయాత్రకు అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు కూడా వ్యాజ్యం వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

రైతులకు సంఘీభావం తెలిపేవారు భోజనాల ఏర్పాటు, వసతి కల్పించడం, విరాళాలు అందించడం చేస్తుంటారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం మధ్యాహ్నం 12.30గంటలకు ఉత్తర్వులు జారీచేస్తే.. ఆ కాపీ రాకముందే పోలీసులు ఆంక్షలు విధించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆంక్షలు విధించడంతో పాటు రైతులు భోజనం చేసే ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లి ఐడీ కార్డులు చూపించమని దౌర్జన్యం చేశారని ఆరోపించారు. డీజీపీ కార్యాలయం నుంచి 150 మందికి మాత్రమే కార్డులు ఇచ్చారని కోర్టుకు వివరించారు.

ప్రభుత్వం తరఫు న్యాయవాది తమకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు పోలీసు ఆంక్షల కారణంగా తాము పాదయాత్రను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని.. అందువల్ల వెంటనే విచారించాలని పిటిషనర్లు కోరారు. రేపు అన్ని పిటిషన్లను కలిపి విచారించి ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం, పిటిషనర్లు ఆచరణ యోగ్యమైన ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news