బాబుని అడ్డంగా ఇరికించేసిన అచ్చెన్న అత్యుత్సాహం!

-

కొంతమందికి మైకు దొరికితే పూనకం వచ్చేస్తుందనుకోవాలో ఏమో కానీ… తెగ మాట్లాడేస్తారు! తప్పేమీ కాకపోయినా… ఆ మాటల వల్ల ఎవరు ఇరుక్కుంటున్నారు, ఎవరు ఇబ్బందిపడుతున్నారు అన్న విషయం కూడా సృహలో పెట్టుకోవాలి! ప్రత్యర్ధులు ఇరుక్కుంటే పర్లేదు.. స్వపక్ష నాయకులే ఇబ్బందిపడిపోతే..? అది లేటెస్ట్ అచ్చెన్న స్పీచ్ లా ఉంటుంది!

ప్రస్తుతం మోడీ నామస్మరణతో కాలం గడుపుతున్నారు బాబు. ఈరోజు కాకపొతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండు.. ఎల్లుండు కాకపోతే అవతలెల్లుండు.. ఏదో ఒకరోజు మోడీ నుంచి ఫోన్ రాకపోతుందా.. మళ్లీ మరో చారిత్రక తప్పిదం చేసే అవకాశం రాకపోతుందా అంటూ చంద్రబాబు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే! ఎందుకంటే… బాబుకు బాగా తెలుసు.. ఈ సమయంలో టీడీపీని, బీజేపీతో స్నేహం తప్ప మరొకటి కాపాడలేదని! ఈ సమయంలో అచ్చెన్నేమో మోడీని విమర్శించడం మొదలుపెట్టారు!

అవును… మొన్న విజయవాడ ఫ్లై ఓవర్స్ సమయంలో బాబు & టీడీపీ నేతలు అంతా మోడీని తెగ పొగిడేశారు! టీడీపీ హయాంలో కేంద్రం నుంచి నిధులు పుష్కలంగా వచ్చేవని.. ఫలితంగా అభివృద్ధి నాలుగు పాదాలా మీదా పరుగులు పెట్టేదని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మైకందుకున్న అచ్చెన్నేమో.. . పోలవరానికి కేంద్రం డబ్బులు ఇవ్వలేదని. కేంద్రం పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందని.. కేంద్రం పట్టించుకోకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా టీడీపీ ప్రభుత్వం 71 శాతం పనులు పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు!

మరి ఈ విషయాలు ఆ నోటా ఈ నోటా పడి మోడీ వరకూ చేరితే! మీ పార్టీకి ఎన్ని నాలుకలు చంద్రబాబూ అని అడిగితే.. మీరు ఇంకా మారలేదా అని ప్రశ్నిస్తే.. బాబు పరిస్థితి ఏమిటి? ఆ మాత్రం గ్రహించకుండా, అధినేత పరిస్థితి అర్ధం చేసుకోకుండా అచ్చెన్న అలా మోడీని ఇరకాటంలో పాడెయ్యొచ్చా? మోడీ దగ్గర బాబుని ఇరికించెయ్యొచ్చా? బాబుకు ఉన్న టెన్షన్స్ చాలవన్నట్లు మళ్లీ ఇదొకటా అచ్చెన్నా?

Read more RELATED
Recommended to you

Latest news