తిరుపతి పై వీర్రాజు కన్ను ?  ఆయన దూకుడు కు కారణం ?

-

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది  ఏపీలో అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 2019 వరకు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళడమే తప్ప సొంతంగా బరిలోకి దిగింది లేదు. అసలు ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదన్నది అందరికీ తెలుసు. కేవలం నాయకులు మాత్రమే బిజెపిలో ఎక్కువగా కనిపిస్తారు. ఏ ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టినా, కొంతమంది కీలక నాయకులు మాత్రమే హాజరు అవుతారు తప్ప కార్యకర్తలు ఎక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నట్టుగా బిజెపిలో ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తరువాత బీజేపీ లో హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఏపీ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా, ఆ పార్టీ ని పక్కకు నెట్టి మరి బీజేపీ ప్రతి విషయంలోనూ వైసీపీని ప్రశ్నిస్తూ హడావుడి చేస్తోంది. క్రమంగా బలం పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అధికారం తమదేనని ధీమాను ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో బిజెపి బరిలోకి దిగితే ఏ విధంగా ఉంటుంది అనే విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం.
బిజెపి బలం ఎంత వరకు ఉంది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా  ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ మేరకు అక్కడి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో బీజేపీకి మంచి పట్టు  ఉండడం,. తిరుపతి నుంచి పోటీ చేస్తే ఫలితం దక్కవచ్చనే అభిప్రాయంలో సోము వీర్రాజు ఉన్నారట. అలాగే కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభించడం వంటి చర్యలతో తిరుపతి ప్రజల్లో ఆగ్రహం ఉందని, అవన్నీ తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, ఖాళీగా ఉన్న అన్ని పార్లమెంటు స్థానాలను ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల ఎన్నికల సంఘం నిర్ణయించుకోవడంతో మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయని, అప్పటికి మరింత బలం పుంజుకోవాలి అని బిజెపి చూస్తోంది. అయితే ఇప్పటి వరకు వైసిపి, టిడిపి లు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో, మరికొన్ని రోజులు వేచి చూసి ఆ తరువాత తిరుపతి ఉప ఎన్నికలపై స్పందించాలని బీజేపీ చూస్తోందట.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news