పరిటాల కుటుంబాన్ని మళ్ళీ టార్గెట్ చేశారా ?

-

టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో కొన్నాళ్లు సైలెంట్‌గా ఉంది పరిటాల కుటుంబం. ఆ మధ్య బీజేపీలో వెళ్తారని జోరుగా ప్రచారం జరిగిన పట్టించుకొని తల్లి,తనయుడు మళ్లీ నియోజకవర్గంలోపర్యటనలు మొదలుపెట్టారు. రాజకీయాల్లో ఎక్కువ కాలం మౌనంగా ఉంటే బాగోదనుకున్నారో ఏమో ప్రత్యర్ధుల పై మాటల తూటలు పేల్చారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినా విజయం దక్కపోవడంతో గ్రామాల్లో పర్యటనలు,పరామర్శలు మొదలు పెట్టారు పరిటాల శ్రీరాం. అయితే అంతే స్పీడుగా పరిటాల కుటుంబం కేసుల పై కేసులు పెడుతు టార్గెట్ చేస్తున్నారు ప్రత్యర్ధులు.

అనంతపురం రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బరిలో దిగిన శ్రీరామ్‌ రాప్తాడులో ఓడిపోయారు. జిల్లాలో పరిటాల కుటుంబానికి ఒక గుర్తింపు ఉంది. అనుచరగణం కూడా ఎక్కువే. పరిటాల రవి మరణం తర్వాత ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగానూ పనిచేశారు. కిందటి ఎన్నికల్లో తనకు బదులుగా కుమారుడు పరిటాల శ్రీరాంను రాప్తాడు నుంచి బరిలో దింపారు సునీత. టీడీపీ అధికారం కోల్పోవడంతో కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయారు. తర్వాత ఏమనుకున్నారో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ధర్మవరం ఇంచార్జ్ వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో రాప్తాడుతోపాటు ధర్మవరం నియోజకవర్గం టీడీపీ బాధ్యతలను కూడా పరిటాల కుటుంబం భుజాన వేసుకుంది.

పరిటాల శ్రీరాం స్పీడు పెంచడంతో ప్రత్యర్దులు సైతం అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. అధికార బలం కూడా వీరికి తోడవ్వడంతో ముప్పేట దాడి మొదలెట్టారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పరిటాల శ్రీరాం ధర్మవరం పర్యటనకు వెళ్లినప్పటి నుంచి పరిస్థితులు వరసగా మారుతూ వస్తుండటం రాజకీయాలను వెడెక్కిస్తోంది. ప్రస్తుతం పరిటాల శ్రీరాం ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆయనపై కేసు అన్నట్టుగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో శ్రీరాం పర్యటనలో ఏ చిన్న వివాదం జరిగిన శ్రీరాం టార్గెట్ గా కేసులు పెడుతున్నారు పోలీసులు.

ధర్మవరం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో నిబంధనలకు విరుద్ధంగా మసీదులోకి వెళ్లి ప్రచారం చేశారని కేసు నమోదైంది. ఆ తర్వాత చెన్నేకొత్తపల్లి ఘటనలో కొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. విషయం తెలిసి అక్కడికి వెళ్లారు శ్రీరాం. మళ్లీ రెండు పక్షాలు పెద్దఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. టీడీపీ, వైసీపీ కేడర్‌ తోపులాట చెన్నేకొత్తపలిలో టెన్షన్‌ క్రియేట్‌ చేసింది. మొత్తానికి శ్రీరాం ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏదో ఒక గొడవ జరగడం వెంటనే కేసులు పెట్టడం జరిగిపోతున్నాయి.

శ్రీరాం పర్యటనలతో స్పీడు పెంచిన తర్వాత రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి,ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డితో ఢీ అంటే ఢీ అనేరీతిలో మాటల యుద్దం కొనసాగించారు. రెండువర్గాలు ఒకరి చరిత్రను ఒకరు తవ్వే ప్రయత్నం చేశాయి. అలా మొదలైన వివాదం ఇప్పుడు కేసుల రూపంలో పరిటాల కుటుంబం టార్గెట్ అయిందన్న చర్చ అనంతపురంలో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news