నేటి నుంచి ‘అగ్నిపథ్‌’ దరఖాస్తుల స్వీకరణ

-

అగ్నిపథ్ విధానం ద్వారా సైనిక నియామకాల ప్రక్రియను ఆర్మీ, నేవీ ప్రారంభించాయి. ‘అగ్నివీరులుగా చేరి దేశానికి సేవ చేయాలనే మీ కలను సాకారం చేసుకోండి అంటూ’ యువతకు రక్షణశాఖ పిలుపునిచ్చింది. అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు శుక్రవారం నుంచి సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్‌ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు. www.joinindianarmy.nic.in  వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

అక్టోబరు 1 నాటికి 23 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ విభాగంలో పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. ఇందులో భాగంగా భారత సైన్యం ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్‌ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ ​14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది (2022) రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. దీంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news