ఇక నుంచి ఆ జిల్లాల్లో కూడా బాలమృతం ప్లస్‌..

-

రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అమలైన బాలామృతం ప్లస్‌ను మరో 7 జిల్లాలకు ప్రభుత్వం విస్తరించనున్నట్లు తెలిపింది. రాష్ట్రవాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రస్తుతం అందిస్తున్న బాలామృతం స్థానంలోనే బాలామృతం ప్లస్‌ను కొమురంభీం ఆసిఫాబాద్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రెండేండ్ల క్రితం చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, ఇదే విధానాన్ని నాగర్‌కర్నూల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఇందులో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ బాలామృతం ప్లస్‌ అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో భాగస్వాములకు రెండు దశల్లో శిక్షణ పూర్తిచేసింది ప్రభుత్వం. ఈ 7 జిల్లాల్లోని దాదాపు 10 వేల అంగన్‌వాడీల నిర్వహణలో భాగస్వాములైన సీడీపీవో, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌, అంగన్‌వాడీ టీచర్‌/ఆయాలకు శిక్షణ పూర్తిచేశారు. అతి తీవ్ర లోప పోషణ (ఎస్‌ఏఎం), తక్కువ లోప పోషణ (ఎంఏఎం) అనే రెండు క్యాటగిరీలుగా విభజించి ఈ బాలామృతం ప్లస్‌ను ఆ రెండు జిల్లాల్లో అమలు చేశారు అధికారులు. రాష్ట్రంలో 0-5 ఏండ్ల వరకు ఉన్న పిల్లల్లో 18.1 శాతం తక్కువ పోషణ లోపం, 4.8 శాతం అతి తీవ్ర పోషణ లోపంతో ఉన్నారని సర్వేలు స్పష్టం చేశాయి. ఈ దుస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దశలవారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news