టీచర్లపై కక్ష కట్టిన సీఎం.. ఇది దానిలో భాగమే : బండి సంజయ్‌

-

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం వారి ఆస్తుల వివరాలను తెలుపాలని సర్యులర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌.. టీచర్లపై కక్ష కట్టిన సీఎం.. ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు కక్ష సాధింపులో భాగమేనని మండిపడ్డారు. కేసీఆర్… మీ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదు? మీతోసహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడాన్ని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Cases filed against Bandi Sanjay over hate speech

ఇది ముమ్మాటికీ ఉపాధ్యాయులను వేధించడంలో భాగంగా జారీ చేసిన ఆదేశాలుగానే భావిస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ది అనే చందంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయకులను వేధించడమే లక్ష్యంగా పిచ్చి తుగ్లక్ మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 317 జీవో పేరుతో ఉద్యోగుల, ఉపాధ్యాయులను రాచిరంపాన పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు బదిలీలు చేస్తూ టీచర్లకు అన్యాయం చేస్తున్నారు. అయినా ముఖ్యమంత్రికి ఇంకా కక్ష తీరనట్లుంది. చదువు చెప్పే సర్కారీ టీచర్లు ఇకపై ప్రతి ఏటా ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని , ఇకపై ఆస్తులు అమ్మాలన్నా… కొనాలన్నా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పడం వేధింపుల్లో భాగమే. ఉద్యోగులకు జీతాలే సక్రమంగా చెల్లించకుండా… ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని కేసీఆర్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదం. టీఆర్ఎస్ నియంత–కుటుంబ–అవినీతి-దుర్మార్గపు పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలను టీచర్లు ప్రశ్నిస్తుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు.

317 జీవోను వ్యతిరేకిస్తూ సర్కార్ ను నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారు. అడ్డదారిలో అక్రమంగా బదిలీలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సర్కార్ తప్పులను ఎండగడుతుంటే ఆగమాగమైతున్నారు. అంతేగాదు…కేసీఆర్ తుగ్లక్ పాలనతో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెబుతూ వారిని చైతన్యం చేస్తున్నారనే భయం పట్టకున్నట్లుంది. టీచర్లుసహా విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వేధించి కక్ష తీర్చుకోవడానికి ఈ జీవోను వాడుకుంటున్నట్లు కన్పిస్తోంది. ఇన్నేళ్ళుగా లేనిది కేసీఆర్ కు ఇప్పుడే ఈ GO ఎందుకు గుర్తుకు వచ్చింది. కేసీఆర్ సీఎం కాకముందు… ఆయన కుటుంబం ఆస్తులెన్ని? ఆ తరువాత కూడగట్టిన ఆస్తులెన్ని? వాటి వివరాలను ఎందుకు ఏటా విడుదల చేయడం లేదు? ఇకపై సీఎంసహా ఆయన కుటుంబ సభ్యులంతా ప్రతి ఏటా ఆస్తుల వివరాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా… ఆస్తుల వివరాలంటే డమ్మీ వివరాలు చెప్పడం కాదు.. సింగపూర్, మలేసియా, దుబాయిలో సీఎం, ఆయన కుటుంబం దోచుకుని దాచుకున్న ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టే దమ్ముందా? అట్లాగే కేసీఆర్ కేబినెట్ లోని మంత్రుల ఆస్తులతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను కూడా ఏటా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అంటూ బండి సంజయ్‌ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news