తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ(BJP) కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. రైతు రుణమాఫీతో పాటు రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ భీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, రైతులు హైదరాబాద్ బషీర్ బాగ్ లోని వ్యవసాయ కమిషనరేట్ వద్ద ధర్నా చేపట్టడానికి ప్రయత్నించారు. దీంతో వారిని ఎల్బీ స్టేడియం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు,కిసాన్ మోర్చా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.
ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ హామీ అమలు చేయాలని, అలానే ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేసారు. అలానే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నిర్బంధిస్తారా అని ప్రశ్నించారు.
ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు అతి ఉత్సహంతో మహిళ రైతులపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ మోసాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు. డిమాండ్లను అమలు చేసేదాక కిసాన్ మోర్చా విశ్రమించదనిన్నారు. కాగా పోలీసులు బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డితో పాటు ఇతర మోర్చా నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.