భాజపా ప్రజాసంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ కు భయం పట్టుకుంది : డీకే అరుణ

-

భాజపా రెండు దశల ప్రజా సంగ్రామ యాత్ర పూర్తయ్యే సరికి కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందుకే భాజపా నాయకత్వాన్ని, కేంద్ర మంత్రులను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. భాజపా నేతలను తిడితే.. పార్టీ ఎదుగుదల ఆగదని స్పష్టం చేశారు.
బంగారు తెలంగాణ గడ్డపై ఏ ఒక్కరికి అయినా రెండు పడక గదుల ఇల్లు దక్కిందా అని ప్రశ్నించారు. యాదాద్రి నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత కార్యక్రమంలో డీకే అరుణ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే భాజపా రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని డీకే అరుణ అన్నారు. తెలంగాణలో తప్పకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని తెలిపారు. యాదాద్రి నరసింహ స్వామినే మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని డీకే అరుణ ఆరోపించారు.
యాదాద్రి ఆలయాన్ని చూస్తే కన్నీళ్లొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. 150 కుటుంబాలను మోసం చేసి.. రోడ్డున పడేసి యాదాద్రిని పునర్నిర్మించారని మండిపడ్డారు. 150 కుటుంబాలను రోడ్డున పడేయమని యాదాద్రి నరసింహ స్వామి చెప్పారా అని ప్రశ్నించారు. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ఆయన పేరు చెప్పుకుని వందల కోట్ల రూపాయల ధనాన్ని మింగేశారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తప్పక అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం కాషాయ కార్యకర్తలు అహర్నిషలు శ్రమించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news