సాగర్ బరిలో కోమటిరెడ్డి..బీజేపీ ప్యూహం పై ఆసక్తికర చర్చ

-

తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ కొత్త ప్యూహాలకు పదును పెడుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక,గ్రేటర్ లో గెలుపుతో ఊపు మీదున్న కమలదళం సాగర్ ఉపఎన్నికలో అనూహ్య నిర్ణయంతో అన్ని పార్టీలకు షాక్ ఇవ్వబోతుందా.నిన్నటి వరకు సరైన అభ్యర్ది లేరన్న కామెంట్స్ కి ఆ ఒక్క నిర్ణయంతో చెక్ పెట్టనుందా..సాగర్ బీజేపీ ప్యూహం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతుంది.

నాగర్జున సాగర్ ఉపఎన్నికను రాజకీయ పక్షాలన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే సీనియర్ లీడర్ జానారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించి రేసులో ముందుండగా అధికార టీఆర్ఎస్ దుబ్బాక షాక్ తో అభ్యర్ది ఎంపిక పై ఆచితూచి అడుగులు వేస్తుంది. బీజేపీ ఒకసమయంలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేరును కూడా పరిశీలించింది. కానీ జానారెడ్డి పార్టీ మారేందుకు సుముఖంగా లేకపోవడంతో ఆ పేరు పక్కన పడిపోయింది. విజయశాంతిని బరిలో దింపుతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక గతంలో పోటి చేసిన నివేదిత రెడ్డి,మరో బీజేపీ నేత అంజయ్య యాదవ్ టిక్కెట్ రేసులో తామున్నామంటు ప్రచారం కూడా మొదలెట్టేశారు.

అత్యంత కీలకంగా భావిస్తున్న సాగర్ ఉపఎన్నికలో బీజేపీ నుంచి సరైన అభ్యర్ది లేకపోవడం ఆ పార్టీని కాస్త డిఫెన్స్ లో పడేసింది. ఇదే సమయంలో కమలదళం అనూహ్యనిర్ణయం తీసుకుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. కొంత కాలంగా పార్టీ పై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాషాయ కండువా కప్పేసి ఆయన్ను పోటీకి దించాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే పార్టీ మారతానంటూ కూడా ఓ దశలో ప్రకటించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటి చేసి విజయం సాధించారు. ఆయన్ను తీసుకొచ్చి నాగార్జున సాగర్‌లో పోటీ చేయిస్తే ఒకవేళ ఆయన గెలిస్తే అప్పుడు ఏదో ఒక చోట ఎమ్మెల్యేగా ఉండాలి కాబట్టి, ఆయన మునుగోడుకు రాజీనామా చేస్తారని అప్పుడు తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందని, ఆ రకంగా తెలంగాణలో ఎన్నికల వేడి తగ్గకుండా చూసుకోవచ్చనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డిని తీసుకొచ్చి సాగర్‌లో పోటీ చేయిస్తే అది ఎంత మేర ప్రభావం చూపుతుందనేది కూడా మరో వర్గం వాదన.

ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికి బీజేపీ ఆఫర్ ఇచ్చినా ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. నోముల తనయుడు భగత్ టిక్కెట్ రేసులో ఉన్నా మంత్రి జగదీశ్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డి, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలో ఒకరు టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉండే అవకాశం ఉంది. వీరందరితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో ఎన్ఆర్ఐ కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ త్రిముఖ పోటిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని బరిలో దించితే గెలిచే చాన్స్ ఉందని బీజేపీ లెక్కలేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news