నైతికంగా బిజెపి విజయం సాధించింది – ఈటెల రాజేందర్

-

మునుగోడులో బిజెపి నైతికంగా విజయం సాధించింది అని అన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. శామీర్ పేట నివాసంలో ఆయన మాట్లాడుతూ.. ఫలితాల్లో జాప్యం తగదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగి మునుగోడులో ఓడిపోతే పార్టీ భవిష్యతే ప్రశ్నార్ధకమవుతుంది అని భావించి ఆయనతో సహా  మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డా పెట్టాలి అని ఆదేశించారని..

TRS గెలిస్తేనే రేపు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉండదు అని హుకుం జారీ చేసి, అధికారులందరినీ చట్టానికి లోబడి కాకుండా కెసిఆర్ అడుగులకి మడుగులు వత్తే విధంగా పని చేయించారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించి, దాడులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలు పోలీసు వాహనాల్లో తీసుకువచ్చి ప్రజలకు పంచిపెట్టారని.. వందల లారీల లిక్కర్ తీసుకువచ్చి ప్రజలకు తాగిపించారని ఆరోపించారు. అనేక బెదిరింపులకు పాల్పడ్డారని, మహిళా సంఘాలకు,  గొల్లకురుమలకు బ్యాంకులో డబ్బులు వేసారని అన్నారు.

“పెన్షన్లు వేస్తామని అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు. స్వయంగా మంత్రులే టిఆర్ఎస్ కి ఓటు వేయకపోతే పెన్షన్ రద్దు అయిపోతుంది అని బెదిరించారు. రాష్ట్ర పరిపాలన గాలికి వదిలిపెట్టి అందరూ మునుగోడులో తిష్ట వేశారు. ఇతర పార్టీల నాయకులను బిజెపి నాయకులను ప్రచారం చేయకుండా దౌర్జన్యం చేశారు. బీజేపీ పోలింగ్ ఏజెంట్లను ప్రలోభ పెట్టారు. సిబ్బందిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా  ఎమ్మార్వో, ఎండిఓలతో ఫోన్లో మాట్లాడే స్థాయికి దిగజారారు. ప్రచారం అయిపోయిన తర్వాత అందరూ మునుగోడు నుంచి బయటికి వెళ్లాలి.. కానీ ఒక్క టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులను మాత్రమే అక్కడ ఉంచారు.

పలివెల గ్రామంలో నా భార్య, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే రాత్రి 11 గంటలకు బయటికి పంపించారు. అర్ధరాత్రి మహిళను ఎలా పంపిస్తారు అన్నా కూడా వినకుండా బయటికి పంపించి టిఆర్ఎస్ వారిని మాత్రం యదేచ్ఛగా పోలింగ్ అయిపోయేంతవరకు ఉండనిచ్చారు.  భయప్రాంతాలకు గురి చేశారు. సారంపేట గ్రామంలో దౌర్జన్యాలు చేశారు. అభ్యర్థి పోలింగ్ సరళిని పరిశీలిస్తుంటే శివన్నపేట, చండూరు ప్రాంతాల్లో దాడులు చేశారు. కౌంటింగ్ లో కూడా జాప్యం చేస్తున్నారు. మునుగోడులో ధర్మమే గెలుస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుంది. టెక్నికల్గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు.  మంత్రులు పనిచేసిన గ్రామాల్లో కూడా వారి చెంప చెళ్లుమనిపించారు.

కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. డబ్బు సంచులు, మద్యం బాటిల్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం  పనిచేయదు అని మరోసారి నిరూపితమైంది. హుజురాబాద్, దుబ్బాకలో చెప్పినా కూడా కేసీఆర్ కి ఇంకా జ్ఞానోదయం రాలేదు. మునుగోడులో కూడా అదే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. నల్లగొండ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావడం గొప్ప పరిణామంగా భావిస్తున్నాను. ఒక నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి దబాయించి పనిచేయగలిగాడు రేపు జనరల్ ఎలక్షన్లో ఇలాంటి పరిస్థితి ఉండదు.

మునుగోడు ప్రజా స్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపు.  మార్పుకు నాంది. కేసీఆర్ నమ్ముకున్న డబ్బు మద్యం కు కాలం చెల్లింది. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మ్రోగిస్తుంది అనడానికి మునుగోడులో భారతీయ జనతా పార్టీ పోరాటం నిదర్శనం”. అన్నారు ఈటల రాజేందర్. నైతికంగా బిజెపి విజయం సాధించింది. కెసిఆర్ నైతికత కోల్పోయారు. సీఎం రోడ్లు రావు, మోరీలు రావు, అభివృద్ధి జరగదు అంటూ బెదిరించిన కూడా ప్రజలు అభివృద్ధి కంటే ఆత్మగౌరవం ముఖ్యమని బీజేపీకి ఓట్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news