బండి సంజయ్ ప్రచారంతో తిరుపతిలో ట్రెండ్ మారుతుందా ?

-

తిరుపతిలో బండి సంజయ్‌ ప్రచారం పై భారీ ఆశలే పెట్టుకుంది బీజేపీ. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్న ఏపీ బీజేపీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం పై దృష్టి పెట్టింది. చివర్లో సంజయ్ తో దూకుడుగా ప్రచారం నిర్వహించి లాస్ట్‌ పంచ్‌ ఇవ్వాలని చూస్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో తన మాటల తూటలతో పార్టీకి క్రేజ్ తీసుకొచ్చిన సంజయ్ ని ఏపీలో ప్రచారం నిర్వాహించాలని ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది.


గతంలోనే భగవద్గీత పార్టీ కావాలో, బైబిల్ పార్టీ కావాలో తేల్చుకోవాల్సిందిగా బండి సంజయ్ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాతబస్తీలోని రోహింగ్యాలపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తామన్న ఆయన కామెంట్స్‌ సంచలనం కావడంతో.. తిరుపతి ఉపఎన్నిక పై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా అంతే సంచలనం అయ్యాయి. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే ర్యాలీలో కూడా బండి సంజయ్ పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

తిరుపతి ప్రచారం వేడెక్కుతున్న సమయంలో ఫైర్ బ్రాండ్ లాంటి బండి సంజయ్‌ సీన్ లోకి దిగితే వస్తే అది పార్టీకి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని ఏపీ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారట. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికతోపాటే తెలంగాణలోని సాగర్‌ అసెంబ్లీకి కూడా ఉపఎన్నిక జరుగుతోంది.ఇప్పటికే సాగర్‌ పై ఫోకస్ పెట్టిన సంజయ్‌ ఏపీ పై అంత దృష్టి పెడతారా అన్న చర్చ కూడా మొదలైంది. ఒక వేళ ముందే ప్రచారానికి తీసుకొచ్చినా ఆ టెంపో చివరి దాక కాపాడుకోవడం కష్టం అని లెక్కలేస్తున్నారు కమలనాథులు. లాస్ట్‌ పంచ్‌ ఇస్తే ఆ ప్రభావం పోలింగ్‌ తేదీ వరకు ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ బీజేపీ నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావు తిరుపతి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. పదవ తేదీ తర్వాత బీజేపీ అగ్రనేతలు సహా పలువురు సినీ స్టార్లు కూడా తిరుపతిలో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎవరు వచ్చినా రాకున్న సంజయ్‌ వస్తే ఇంకెలాంటి వ్యాఖ్యలు చేస్తారో.. ఎలాంటి హీట్‌ పుట్టిస్తారో అన్న ఉత్కంఠ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ఉంది. మరి సంజయ్‌ తిరుపతిలో ఎలాంటి సంచలనాలకు కారణమవుతారో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version