బాబు అంత రచ్చ ఎందుకు…టీడీపీకే రివర్స్ అవుతుందిగా…!

-

ఇటీవల ఏపీ కేబినెట్ విద్యుత్ నగదు బదిలీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంతో పాటుగా, రైతులకు నగదు బదిలీ విధానంలో బిల్లులు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం ఫిక్స్ అయింది. అలాగే విద్యుత్ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించడానికి పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఖరారు చేసింది. ఇక రైతులకు ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీ అమలుపై చంద్రబాబుతో సహా టిడిపి నేతలందరూ మండిపడుతున్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగారుస్తున్నారని, రైతుల్లో మీటర్ భయం పట్టుకుందని, అదనపు బిల్లులు రైతులు చెల్లించాలా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలు ఈ పథకం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిపోతుందన్నట్లుగా బాబు అండ్ బ్యాచ్ మాట్లాడుతున్నారు. అయితే రైతుల కోసం మాట్లాడటంలో తప్పులేదు… కానీ ఆ పథకం రైతులకు నిజంగానే నష్టం చేకూరుతుందా ? అసలు అమలు కాకుండా, క్షేత్ర స్థాయిలో రైతుల దగ్గరకు వెళ్ళి, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా టీడీపీ నేతలు ఇష్టారీతిన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక దీని వల్ల రైతుల్లో ఓ భయం సృష్టించి, రాజకీయంగా లబ్ది పొందేందుకు టీడీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోందని అర్ధమైపోతుంది. అటు రైతుల్లో కూడా టీడీపీ నెగిటివ్ అవుతోంది. పథకం అమలయ్యి నిజంగా రైతులకు నష్టం జరిగితే అప్పుడు స్పందిస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడే ఇంత రచ్చ చేయడంలో వల్ల చంద్రబాబుకు ఒరిగేదేమీ లేదన్న‌ది ప్ర‌తి ఒక్క‌రికి స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

పైగా ఈ ఉచిత విద్యుత్ టీడీపీకే రివర్స్ అవుతోంది. టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే, వైసీపీ నేతలు గతంలో చంద్రబాబు పాలనలో రైతులపై దాడులు జరిగిన ఘటనలని తీసుకొచ్చి మరీ ఏకీపారేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ హయాంలో జరిగిన బషీర్‌బాగ్ ఘటనని తెరపైకి తీసుకొస్తున్నారు. విద్యుత్ చార్జీలపై ఉద్యమించిన రైతులపై కాల్పులు జరిపిన ఘటనని ఎవరు మరిచిపోలేదంటూ వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక ఈ పరిణామాలను చూస్తుంటే బాబు అండ్ బ్యాచ్ సైలెంట్‌గా ఉండి, పథకం అమలయ్యాక ఇబ్బందులు ఉన్నప్పుడు మాట్లాడితే బెటర్. లేదంటే ఈ విద్యుత్ మీటర్ల విషయంలో టీడీపీకే ఎక్కువ మైనస్ అవుతోంది అన‌డంలో సందేహం లేదు.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news