భోజనం విషయంలో గొడవ.. యజమానులను గొడ్డలితో నరికిన వంట మనిషి

-

భోజనం విషయంలో ఓ రోజు యజమానితో జరిగిన గొడవను ఆ ఇంటి వంట మనిషి మనసులో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కోపం పెంచుకున్న అతడు వారిపై పగ తీర్చుకోవడానికి వేచి చూశాడు. తీరా సమయం దొరగ్గానే భార్యాభర్తలిద్దరిని గొడ్డలితో నరికి చంపాడు. పిల్లలను కూడా చంపడానికి ప్రయత్నించాడు. అతడి నుంచి బాలుడు తప్పించుకోగా.. బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

నిందితుడు సత్యేంద్ర లక్రా కొన్నాళ్లుగా రిచర్డ్‌, మెలెనీ మింజ్‌ దంపతుల ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అయితే, భోజనం విషయంలో రిచర్డ్‌కు, వంట మనిషికి మధ్య కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. ఆ సమయంలో సత్యేంద్రను రిచర్డ్‌ హెచ్చరించాడు. దీంతో కోపం పెంచుకున్న సత్యేంద్ర.. ఆ కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పదునైన గొడ్డలితో రిచర్డ్‌ దంపతులను హతమార్చాడు.

అనంతరం వారి పిల్లలపైనా దాడికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర గాయాలు కాగా బాలుడు తప్పించుకొన్నాడు. విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో.. పారిపోతున్న సత్యేంద్రను వారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన బాలిక ప్రస్తుతం రాంచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

అయితే, రిచర్డ్ తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడని.. అందుకే అతడు దాడికి పాల్పడేముందే వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నానని నిందితుడు పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. సత్యేంద్రపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news