కొడుకు ఆగడాలు భరించలేక అన్నంలో పురుగుల మందు కలిపి పెట్టిన తల్లి..

-

కన్నతల్లికి ఉన్నంత సహనం మరెవరికి ఉండదంటారు.. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి వెనకేసుకోస్తుంది. కడుపున పుట్టినవాడు ఎలాంటోడు అయినా భరిస్తుంది. ఆఖరికి భర్తను అయినా వదిలేస్తుందేమో కానీ.. బిడ్డల చేయి మాత్రం వదలదు. ఈ సృష్టిలో తల్లి ప్రేమ అంత మధురమైనది, స్వచ్ఛమైనది మరొకటి లేదంటారు.. కానీ ఆ తల్లి బిడ్డ చేసే ఆగడాలు భరించలేకపోయింది. తాగుడుకు బానిసా తల్లి, అక్కను చితకబాదుతుంటే చూడలేకపోయింది. వేధింపులు భరించలేక కొడుకునే హతమార్చింది…! ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోనే..

డెంకాడ మండలానికి చెందిన గొడ్డు రామాయమ్మ భర్త మూడేళ్ల కిందట చనిపోయారు. కుమార్తె సునీత, కుమారుడు సాయితో కలిసి పూసపాటిరేగ మండలం గుండపురెడ్డిపాలెంలో వారు నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఫార్మా కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే.. కుమారుడు 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోయి మంచానికే పరిమితమయ్యాడు. అంతకుముందే చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లోనూ మద్యం తాగేవాడట….

రోజూ మాంసం వండాలని, మద్యం తీసుకురావాలని తల్లిని, అక్కను వేధించి కొట్టేవాడు. కుమారుడి ఆగడాలను భరించలేక రామాయమ్మ శుక్రవారం రాత్రి సాయి (20)కి అన్నంలో పురుగులమందు కలిపి వడ్డించిది. అది తిన్న సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తల్లే అంబులెన్సుకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించింది.. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి శనివారం చనిపోయాడు.

ఈ మృతిపై సోదరి సునీత అనుమానాలు వ్యక్తం చేయడంతో.. తల్లిని విచారించగా వేధింపులు తట్టుకోలేక విసిగిపోయి అన్నంలో పురుగుమందును కలిపినట్లు అంగీకరించారు. పోలీసులు తల్లి రమాయ్మను అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి ఘటనలు ఈ మధ్య జరుగుతూనే ఉన్నాయి..గంజాయికి బానిసైన కొడుకుని అది మానిపించాలని కట్టేసి కళ్లలో కారం కొట్టింది ఓ తల్లి.. ఆ బాధ భరించలేక ఇంకెప్పుడు గంజాయి జోలికి వెళ్లనని కేకలు వేశాడు..ఆ మధ్య ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయింది. కాబట్టి.. అబ్బాయిలూ..అమ్మే కదా. ఏం చేసినా భరిస్తుంది అని మరీ పేట్రేగిపోకండి..కన్నతల్లే తేడా వస్తే..కాళికామాత అవుతుంది జాగ్రత్త..!

Read more RELATED
Recommended to you

Latest news