కశ్మీర్​లో​ ఎన్​కౌంటర్​.. నలుగురు ముష్కరులు హతం

-

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై జరిపిన రెండు ఎన్​కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. మరో ముగ్గురిని ప్రాణాలతో పట్టుకున్నారు. పుల్వామా, అనంత్​నాగ్​ జిల్లాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. పుల్వామా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు, అనంత్​నాగ్​ జిల్లాలో మరో ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు, ఆర్మీ అధికారులు వెల్లడించారు.

అలాగే, శ్రీనగర్, బుద్గాం జిల్లాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలకు ఇది “పెద్ద విజయం” అని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

పుల్వామాలో ఎన్​కౌంటర్​ మృతుల్లో ఇద్దరు విదేశీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. మరణించిన స్థానిక ఉగ్రవాదిని ముఖ్తియార్​​ భట్​గా గుర్తించారు. వీరంతా ఓ సైనిక శిబిరంపైకి దాడికి వెళ్తున్నారని కశ్మీర్​ అదనపు డీజీపీ తెలిపారు. వారిలో ముఖ్తార్​ భట్​ గతంలో ఓ సీఆర్​పీఎఫ్ ఏఎస్​ఐ, ఇద్దరు ఆర్​పీఎఫ్ సిబ్బందిని చంపాడని చెప్పారు. అనేక ఉగ్రచర్యల్లో భాగమైన లష్కరే తొయిబాకు కమాండర్​గా పనిచేస్తున్నట్లు తెలిపారు. వారి నుంచి ఒక ఏకే-74, ఏకే-56 రైఫిల్, ఒక పిస్టల్​ స్వాధీనం చేసుకునట్లు ఆర్మీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news