ఎడిట్ నోట్: బీజేపీ ‘బెంగాల్’ వ్యూహం..!

-

అసలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద బలం లేని సంగతి తెలిసిందే..ఎప్పుడైనా ఒకటి, రెండు సీట్లు గెలుచుకోవడమే తప్ప..అక్కడ బీజేపీకి పెద్ద సీన్ లేదు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్‌కి పోటీ ఇచ్చి 42 సీట్లుకు గాను 18 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై కూడా గట్టిగా ఫోకస్ చేసింది. టి‌ఎం‌సి అధినేత్రి మమతా బెనర్జీ..కాంగ్రెస్, వామపక్ష పార్టీలని అణిచివేయడంతో అనూహ్యంగా బీజేపీకి ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్‌ని ఉపయోగించుకుని బీజేపీ బలపడింది.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ మమతా అధికారంలోకి వచ్చినా సరే..బీజేపీ మాత్రం పోటీ ఇచ్చి 77 సీట్లు గెలుచుకుంది. అదే అంతకముందు ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంటే వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ ఎంత బలపడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సేమ్ బెంగాల్ ఫార్ములాతోనే తెలంగాణలో బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది. కేసీఆర్ ఎలాగో..టీడీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌లని తోక్కేశారు. దీంతో బీజేపీ బలపడటానికి ఛాన్స్ దొరికింది. ప్రజలు టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారు. అందుకే రెండు ఉపఎన్నికల్లో బీజేపీని ఆదరించారు.

ప్రస్తుతానికి తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య హోరాహోరీగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇక బలంగా ఉన్న టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటే…ఇప్పుడు బీజేపీకి ఉన్న బలం సరిపోదు. ఇంకా బలపడాలి. పైగా కాంగ్రెస్ ఇంకా వీక్ అవ్వలి..అలాగే టీఆర్ఎస్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత పూర్తిగా బీజేపీకి కలిసిరావాలి. ఇదంతా జరగాలంటే బీజేపీ గట్టిగా కష్టపడాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీకి బలమైన నాయకుడు కావాలి. ఇప్పుడు ఇదే బీజేపీకి ఉన్న పెద్ద లోటు. ఈ లోటుని భర్తీ చేసేందుకు అమిత్ షా గట్టిగానే ట్రై చేస్తున్నారట.

పైగా రాష్ట్ర ప్రజల నాడిని పక్కాగా తెలుసుకునేందుకు బీజేపీ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతోనే ముందుకెళ్లడానికి రెడీ అయింది. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో సంబంధం లేకుండా రహస్య సర్వే చేపట్టాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ సర్వే చేసేందుకు బిజినెస్‌ స్కూల్స్‌కు చెందిన ఓ బృందాన్ని బీజేపీలో తలపండిన వ్యూహకర్తని..అమిత్‌ షా ఇప్పటికే నియమించి రంగంలోకి దించినట్లు సమాచారం.

ఈ సర్వే బృందం స్వేచ్ఛగా పనిచేయనుంది..స్థానిక బీజేపీ నేతలతో సంబందం లేకుండా వాస్తవ పరిస్తితులని తెలుకోనుంది. అలాగే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి బలం ఎక్కువ ఉంది…అలాగే బీజేపీ తరుపున బలమైన నాయకుడుని ఎవరిని నిలబెట్టాలి. నియోజకవర్గాల్లో ఓటింగ్‌ను ప్రభావితం చేసే బలమైన సామాజిక వర్గం ఏమిటి? ఏ వర్గం అభ్యర్థికి టికెట్‌ ఇవ్వొచ్చు? అనే అంశాలపై సర్వే చేయనున్నారు. ఓవరాల్‌గా బెంగాల్ తరహాలో తెలంగాణలో సర్వే చేయిస్తూ..నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తుంది. అదే సమయంలో టీఆర్ఎస్‌లో ఉండే బలమైన అభ్యర్ధులపై..బీజేపీ తరుపున బలమైన అభ్యర్ధులని పెట్టాలని చూస్తున్నారు.

ఇది కూడా బెంగాల్ ఫార్ములానే. మమతా బెనర్జీపై సువేందు అధికారి పోటీ చేసి గెలిచారు. అదే తరహాలో తెలంగాణలో ముందుకెళ్లాలని చూస్తున్నారు. కేసీఆర్‌పై ఇప్పటికే పోటీ రెడీ అని ఈటల రాజేందర్ అంటున్నారు. అలాగే కేటీఆర్, హరీష్ ఇలా బడా నేతలని ఎటు కదలనివ్వకుండా వారి నియోజకవర్గాలపైనే ఫోకస్ చేసేలా..బలమైన నేతలని ప్రత్యర్ధులుగా పెట్టాలని చూస్తున్నారు. మరి చూడాలి తెలంగాణలో బెంగాల్ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news