ఎడిట్ నోట్: గోకుతూనే ఉన్న కేసీఆర్..!

-

ఎప్పుడైతే బీజేపీపై వార్ స్టార్ట్ చేశారో అప్పుడే కేసీఆర్ ఒక భారీ డైలాగ్ ఒకటి వేశారు.. “మాతో గోక్కుంటే అగ్గే.. మీరు మాతో గోక్కున్నా.. గోక్కోపోయినా దేశ ప్రజల కోసం నేను మిమ్మల్ని గోకుతూనే ఉంటా అంటూ” కేసీఆర్..బీజేపీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే అన్న మాట ప్రకారం..కేసీఆర్ ఎక్కడ చూసినా..బీజేపీని గోకుతూనే ఉన్నారు. అసలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పుడైతే బీజేపీ..తెలంగాణపై ఫోకస్ చేసి..కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా రాజకీయం చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కేసీఆర్ రివర్స్ అయ్యారు.

ఓ వైపు రాష్ట్రంలోని బీజేపీ నేతలకు కౌంటర్ ఇస్తూనే…మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. దేశంలో విపక్ష పార్టీలని ఏకం చేస్తున్నారు. అలాగే త్వరలోనే జాతీయ పార్టీ పెట్టి..బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అసలు ఎప్పుడు, ఏ సమయంలోనైనా కేసీఆర్..ప్రతి మాట బీజేపీనే టార్గెట్ చేసి ఉంటుంది. ఏదైనా సభలోనైనా, మీడియా సమావేశంలోనైనా, ఆఖరికి ఏదైనా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో కూడా కేసీఆర్ టార్గెట్ ఒకటే..అదే బీజేపీ.

అంటే బీజేపీని కేసీఆర్ గోకుతూనే ఉన్నారు..ఈ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అటు బీజేపీ సైతం తమదైన శైలిలో రాజకీయం చేస్తూ..తెలంగాణలో కేసీఆర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకు కదులుతుంది. ఇదే క్రమంలో బీజేపీ జాతీయ నేతలు సైతం తెలంగాణపై ఫుల్ గా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అమిత్ షా పదే పదే తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఇక పోటీగా కేసీఆర్ కూడా తెలంగాణ విలీన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా విమోచన దినాన్ని వీరు రాజకీయ యుద్ధంగా మార్చేసి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామంటూ ఎన్నికల్లో, ఉద్యమ సమయంలో హామీలిచ్చి, వేలాది మంది బలిదానాలతో అధికార పీఠంపైకి ఎక్కిన తరువాత మాట తప్పారని కేసీఆర్ టార్గెట్ గా అమిత్ షా విమర్శలు చేశారు.

ఇక కేసీఆర్ యథావిధిగానే మోదీ సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేశారు. అలాగే కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా.. రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు వారంలోగా జీవో విడుదల చేస్తామని, దాన్ని ఆమోదించి గౌరవాన్ని కాపాడుకుంటరా? లేకపోతే ఉరితాడుగా మార్చుకుంటారా? ప్రధాని మోదీనే తేల్చుకోవాలె అంటూ కొత్త ఫిట్టింగ్ పెట్టారు. గిరిజనుల ఓట్లు టార్గెట్ గా కేసీఆర్ కొత్త రాజకీయం మొదలుపెట్టారు. అలాగే 10 శాతం రిజర్వేషన్లని కేంద్రం కోర్టులో పెట్టారు. ఇక కేంద్రం చేయకపోతే తామే అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి చూసుకుంటే బీజేపీని..కేసీఆర్ గోకుతూనే ఉన్నారు. మరి ఈ గోకుడు ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news