పట్టపగలు వచ్చి అబద్ధాలు మాట్లాడే పార్టీ బీజేపీ : హరీశ్‌రావు

-

కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి పట్టపగలే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అసత్యాలు పలికే పార్టీ బీజేపీ అని విమర్శించారు. బీజేపీ మాట్లాడేవన్నీ అసత్యాలు, అర్ధసత్యాలని.. తాము మాట్లాడేవి నగ్నసత్యాలని అన్నారు. రేషన్‌ దుకాణంలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అనడం హాస్యాస్పదంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఆమె ప్రవర్తించారని మండిపడ్డారు.

మెదక్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘‘దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ నుంచి కేంద్రానికి డబ్బులు ఇస్తున్నాం. రాష్ట్రం నుంచి రూ.3,65,795 కోట్లు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. కేంద్రానికి రాష్ట్రం నుంచి వెళ్లే సొమ్ము ఎక్కువ.. కేంద్రం నుంచి వచ్చేది తక్కువ. కేంద్రాన్ని, కొన్ని రాష్ట్రాలను సాకడంలో తెలంగాణ ప్రభుత్వం వాటా ఉంది.. రాష్ట్ర ప్రజల సంపద ఉంది. మరి ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ ప్రతినిధి, సీఎం కేసీఆర్‌ ఫొటో మీరు పెట్టండి. మీరు అలా మాట్లాడితే మేమూ మాట్లాడగలం. ’’ అని హరీశ్‌రావు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news