ఉద్యోగుల్లో పెరుగుతున్న బ్రెయిన్‌ డ్రెయిన్‌.. కంపెనీలు కాస్త విరామం ఇవ్వాల్సిందే..!!

-

ఈరోజుల్లో ఉద్యోగం చేసేవారి పరిస్థితి దయనీయంగా మారింది.. ఎప్పుడు ఆఫీస్‌ మెయిల్స్‌ డీయాక్టివేట్‌ అవుతాయో తెలియడం లేదు.. పొద్దునలేస్తూనే.. ఆ కంపెనీ అంతమందిని తీసేసిందట.. ఈ కంపెనీ ఇంత మందిని పీకేసిందట.. ఇవే ముచ్చట్లు..లింక్డిన్‌ ఓపెన్‌ చేస్తే అందరూ ఓపెన్‌ టూ వర్క్‌ పెట్టుకుంటున్నారు. ఉన్న ఉద్యోగంలో ప్రజర్‌.. దొరికిందే చాన్స్‌ అని ..కాస్త ఆర్థికంగా బాగున్న కంపెనీలు ఉద్యోగుల మీద పనిభారం మోపుతున్నాయి.. ఏం చేస్తారు..బయట ఉద్యోగాలు లేవు..మానేయలేరు.. ఎంత చెప్పినా వినాల్సిందే అనే ధోరణిలో కొన్ని కంపెనీలు ఉన్నాయి… నిజానికి రెండు నెలల్లో ఉద్యోగాలకు హైక్‌ పండగ వస్తుంది.. ఏటా ఎంత ఇస్తారో అనే ఒక టెన్షన్‌, ఉత్సాహం ఉండేది.. కానీ ఇప్పుడు ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలులే అనుకుంటున్నారు.. అయితే ఉద్యోగులపై ఓ కంపెనీ సర్వే చేసింది..మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా.. ఈరోజు వర్క్‌ భలే ఫాస్ట్‌గా అయిపోయింది.. ఇప్పుడేంటో అస్సలు పని ముందుకు సాగడం లేదు అని.. నిజానికి మనం ఏం అనుకుంటాం అంటే.. మన మూడ్‌ను బట్టే..ఇలా అనిపిస్తుంది అని కానీ ప్రతి పదిమంది ఉద్యోగులలో ఆరుగురికి ఇలానే జరుగుతుందట.. దీన్ని బ్రెయిన్‌ డ్రెయిన్‌ అంటారని పరిశోధకులు అంటున్నారు.

ఈ సమయంలో పని చురుగ్గా ఉంటుంది..

రోజులో ఏ సమయంలో పని చురుకుగా సాగుతుంది? ఏ సమయంలో మందకోడిగా సాగుతుంది? అనే అంశాలపై సర్వే నిర్వహించారు..ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు ఉదయం 10.22 గంటల సమయంలో చాలా చురుకుగా.. మంచి ప్రొడక్టివిటి సామర్థ్యం కలిగి ఉంటారట. మధ్యాహ్నం 1.27 గంటల సమయంలో చాలా మందకోడిగా ఉంటారట. ఇక సమయం 2.06 గంటలకు చేరే టైమ్‌కు మరింత నెమ్మదిగా పని చేస్తారు.. ప్రతి పది మంది ఉద్యోగుల్లో ఆరుగురు ఇలాగే ఉంటారని స్టడీ చెబుతోంది.. ఈ సమయంలో పని సరిగ్గా చేయడానికి చాలా కష్టపడతారట.

టైమ్‌పాస్‌కు ఇవే కారణాలు..

కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం, సహోద్యోగులు తరచుగా అంతరాయం కలిగించడం, తగినంత విరామం దొరక్కపోవడం వంటి కారణాల వల్ల కూడా పనికి అంతరాయం కలుగుతుంది.. రెంటల్ ఏజెన్సీ ఆఫీస్ ప్రీడం’ అనే సంస్థ దాదాపు 2000 మంది ఉద్యోగుల నుంచి ఓటింగ్ తీసుకుని ఈ స్టడీ చేసింది..ఇంటి నుంచి పని చేయడం కంటే ఆపీసులో పనిచేయడంలోనే ఫన్ ఉందని సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అంటున్నారు.. పని విధానం, ప్రొడక్టివిటి కూడా ఆఫీసులోనే మెరుగ్గా ఉందని అన్నారట. అయితే, పరిసరాల్లో వినిపించే శబ్ధాలు, గదిలోని ఉష్ణోగ్రత, సహోద్యోగుల కలిగించే అంతరాయం, లేదా మాటలు, లేదా అనుమాన నివృత్తులు వంటివన్నీ కూడా కాలయాపనకు కారణాలు అవుతున్నాయట. సాధారణంగా వీక్ స్టార్టింగ్‌లో ఉద్యోగులు ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తారు. వారం గడిచే కొద్దీ నెమ్మదిగా ఉత్సాహం సన్నగిల్లుతుందట. వీకెండ్స్‌లో ప్రొడక్టివిటీ తగ్గడానికి కారణం ఇదేనట.

కంపెనీలు ఇలా చేస్తే..

ఆఫీసుల్లో పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. ఉద్యోగులను సౌకర్యంగా ఉంచడం అవసరం అని సర్వే చెబుతోంది. పనులు చురుగ్గా సాగాలంటే అందుకు తగిన వాతావరణం ఆఫీసులో కల్పించాలి. అంతేకాదు, తగినంత పని విరామం కూడా అవసరమే.. కొంత మోటివేషన్, కొంత విరామం, మరికొంత ప్రోత్సాహంతో ప్రొడక్టివిటి పెంచుకోవచ్చు…!

Read more RELATED
Recommended to you

Latest news