తాడిపత్రి రగడ ముగిసినట్టా..జేసీ వ్యాఖ్యలతో ముదిరినట్టా

-

దాడులు, వార్నింగ్‌లు, మాటల తూటాలు, నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులు.. ఇదీ తాడిపత్రిలో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితులు. వీటికి జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష విరమణతో బ్రేక్ పడింది. ఇవాళ ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాలకు కూడా తెరపడింది. అయితే ఇది అంతం కాదు ఆరంభం అని జేసీ ప్రకటించడం.. మరో కొత్త ఎపిసోడ్‌కు తెరలేపారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిసెంబర్ 24 మొదలైన ఉద్రిక్త పరిస్థితులు, టెన్షన్ వాతావరణానికి తాత్కాలికంగా విరామం పడింది.పోలీసుల తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగం చేస్తున్నారంటూ జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్షకు దిగడం మొత్తం ఘటనను పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లింది. ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్న జేసీని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఇంటి వద్దనే నల్లదుస్తులు ధరించి దీక్ష చేశారు.

మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమ… తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.దీంతో ఆమె అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన నివాసంలో దీక్ష చేస్తున్న సమయంలో కొందరు మహిళలు ఆయన ఇంటికి వచ్చారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని అప్పుడే ఏదైనా చేయగలరని .. వెంటనే దీక్ష విరమించాలంటూ విజ్ఞప్తి చేశారు. కోర్టుల ద్వారా పోరాడుదామని మహిళలు నచ్చజెప్పి జేసీ చేతో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు మహిళలు.

అయితే ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎన్ని రోజులు 144సెక్షన్ పెట్టి తమను అడ్డుకుంటారని.. ఇక నుంచి గ్రామాలకు వెళ్లి చట్టం దుర్వినియోగం పై ప్రచారం చేస్తామన్నారు. మొత్తం మీద జేసీ తాడిపత్రిలో పరిస్థితులు కాస్త అదుపులోకి రావడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు జనం. గత 11రోజులుగా జరుగుతన్న ఈ ఘటనలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news