వైసీపీలో ట్విస్ట్‌లు..జంపింగులేనా..ఆ లేడీ ఎమ్మెల్యే కూడా?

-

ఏపీలోని అధికార వైసీపీలో ఊహించని ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. ఓవైపు అధికార బలంతో ప్రతిపక్ష టీడీపీకి ఎక్కడకక్కడ చెక్ పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్న వైసీపీకి సొంత తలనొప్పులు ఎక్కువయ్యాయి. ప్రతిపక్షాలే విమర్శలు చేస్తే పర్లేదు..కానీ సొంత పార్టీ వాళ్లే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి వ్యవహారం బాగా తలనొప్పిగా మారింది. ఏకంగా ఆయన నెక్స్ట్ వైసీపీ గెలవదు అనే విధంగా మాట్లాడేశారు.

దీంతో జగన్..ఆనంకు చెక్ పెడుతూ..వెంకటగిరికి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇక ఆనం సైతం ఇంకా వైసీపీలో ఉండటం కష్టమని తెలుస్తోంది. ఈయన టీడీపీలోకి జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం..ప్రభుత్వంపై విమర్శలు చేశారు..కాకపోతే ఆయన్ని జగన్ పిలిపించి మాట్లాడి..సమస్యకు చెక్ పెట్టారు.  అదే సమయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరో బాంబు పేల్చారు.

ఇటీవల గుంటూరులో తొక్కిసలాట ఘటనలో ఎన్‌ఆర్‌ఐ వుయ్యూరు శ్రీనివాసరావుని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చారు. అయితే ప్రజలకు సేవ చేసే శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం సరికాదని చెప్పి వసంత అన్నారు. ఇక వసంత కూడా టీడీపీ అధినేతతో టచ్ లో ఉన్నారని, ఈయన కూడా పార్టీ మారడానికి రెడీ అవుతారని ప్రచారం ఉంది.

తాజాగా మాజీ హోమ్ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఓ బాంబు పేల్చారు. తాము ఎప్పుడు వైసీపీ కుటుంబ సభ్యులమని చెబుతూనే..  తన భర్త దయాసాగర్‌ పార్టీ మారతానని, తనని కూడా రమ్మంటే ఎంత రాజకీయ నాయకురాలినైనా.. ఒక భార్యగా తాను కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తాను కదా అని వ్యాఖ్యానించారు. దయాసాగర్‌ ఒక పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో, పిల్లలు చెరొక పార్టీలో ఉండరన్నారు. అందువల్ల వైఎస్ జగన్ పార్టీతో మనగలిగినన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

అంటే సుచరిత మాటలు బట్టి చూస్తే సుచరిత భర్త వేరే పార్టీలోకి వెళ్లడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు సుచరిత కూడా జంప్ అవుతారని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో తిరుగుబాటు జెండా ఎగరవేసే వాళ్ళు ఎక్కువయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news