కరోనా చికిత్స విషయంలో ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోపోతే 50శాతం పడకలను ప్రభుత్వ ఆధీనంలోని తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి 1039 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నా.. డబ్బులు కట్టమంటున్నారని.. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులను అంగీకరించడం లేదని ఫిర్యాదు చేశారు.

హాస్పిటల్కు వెళ్తే చాలు కరోనా లక్షణాలు లేకున్నా.. టెస్టులు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని ఈటల తెలిపారు. ఈ నేపధ్యంలో ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామన్నారు. హాస్పిటళ్ల నుంచి వివరణ కోరామని ఆయన తెలిపారు. అలాగే ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు వాటి తీరును మార్చుకోవాలని సూచించారు.లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.