బికినీ ధరించిన ప్రొఫెసర్‌.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం

-

బికినీ ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టిన కారణంగా ఓ మహిళా ప్రొఫెసర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. యూనివర్సిటీకి అపార నష్టాన్ని కలిగించారని ఆక్షేపిస్తూ నష్టపరిహారంగా రూ.99కోట్లు కట్టాలంటూ ఆమెను వర్సిటీ అధికారులు ఆదేశించారు. గతేడాది అక్టోబర్‌లోనే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, తానేం తప్పు చేయలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఆ ప్రొఫెసర్‌ చెబుతున్నారు.

కోల్‌కతాలోని ప్రముఖ సెయింట్‌ జేవియర్స్‌ యూనివర్సిటీకి చెందిన 18ఏళ్ల యువకుడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్రొఫెసర్‌ బికినీలో ఉన్న ఫొటోలు చూడటం అతడి తండ్రి గమనించాడు. దీనిపై విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశాడు.

‘ఫ్రొఫెసర్‌కు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన రీతిలో ఉన్న ఫొటోలను నా కుమారుడు చూడటాన్ని గమనించాను. వాటిని చూసి నిర్ఘాంతపోయాను. ఒక అధ్యాపకురాలు లోదుస్తులు ధరించి సోషల్ మీడియాలో చిత్రాలను అప్‌లోడ్ చేయడం అవమానకరం. ఇలాంటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఆమె తన విద్యార్థులకు ఏం బోధిస్తున్నారు. ఇది అసభ్యకరమైన చర్య, సరికాదు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఉద్యోగం నుంచి తప్పించి..

కాగా, దీనిపై విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. వర్సిటీకి అపారమైన, కోలుకోలేని నష్టాన్ని కలిగించారంటూ ఆమెను ఉద్యోగంలోనుంచి తొలగించింది. దీనిపై ఆ మాజీ ప్రొఫెసర్‌ తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. గత అక్టోబర్‌లో రిజిస్ట్రార్‌, ఉప కులపతితో కూడిన ఓ కమిటీ విచారణను తాను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఆ సమావేశంలో ఫిర్యాదు లేఖను తన ముందు చదివి వినిపించి.. ఉద్యోగం నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అదే నెల చివరి వారంలో తాను రాజీనామా చేసినట్లు వివరించారు.

యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రెస్‌ కోడ్‌కు సంబంధించి తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఇన్‌స్ట్రా ప్రొఫైల్‌ కూడా ప్రైవేట్‌ ఖాతాయేనన్నారు. దాన్ని ఎవరో హ్యాక్‌ చేశారేమోనని, అందుకే ఆ ఫొటోలు లీకయ్యాయంటూ అదే నెలలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా తనను ఉద్యోగంలోనుంచి తొలగించారని, విద్యార్థి తండ్రి ఫిర్యాదు కాపీని ఇవ్వాలని కోరుతూ విశ్వవిద్యాలయానికి లీగల్ నోటీసు పంపారు.

నోటీసుపై వర్సిటీ స్పందిస్తూ.. పాటు ఇది ‘చెడు ప్రేరేపిత’ చర్యగా పేర్కొంది. యూనివర్శిటీకి కోలుకోలేని నష్టం కలిగించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, రూ.99 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు పంపినట్లు ఆమె తెలిపారు. దీనిపై ఆ ప్రొఫెసర్‌ స్పందిస్తూ.. హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. పెద్దపెద్ద విద్యాసంస్థలు తమ ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరించడం శోచనీయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news