వణుకు వ్యాధికీ సర్జరీ చేస్తారంట.. తెలుసా..?

-

సాధారణంగా కాళ్లు, చేతులు వణుకుతున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు మెడిసిన్ ఇస్తారు. ఆ మందులతోనే వ్యాధి నయం కాకపోయినా తీవ్రత తగ్గుతుంది. కానీ మళ్లీ మళ్లీ వ్యాధి తిరగబెడుతుంది. అందుకే వణుకు వ్యాధికి శాశ్వత పరిష్కారం వైపు చూస్తారు బాధితులు. కానీ అది అంత సులభం కాదు. వణుకు వ్యాధి తగ్గడానికి చేసే సర్జరీ చాలా రిస్క్​తో కూడుకున్నది.


లక్ష మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన ఈ వణుకుడు వ్యాధి క్యూఫర్‌ రేకబ్‌ సిండ్రోమ్‌ (కేఆర్‌ఎస్‌)కు నిమ్స్‌ వైద్యులు శస్త్రచికిత్స చేపట్టి సఫలీకృతులయ్యారు. ఇప్పటి వరకు ఈ వ్యాధికి ఔషధాలతోనే చికిత్స అందిస్తున్నారు. మందులు వాడటం మానేస్తే తిరిగి వ్యాధి మొదటికొస్తుంది. నిమ్స్‌ వైద్యులు మాత్రం దేశంలోనే తొలిసారిగా రోగికి డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపించారు.

సర్జరీ తర్వాత రోగి క్రమంగా కోలుకున్నారని నిమ్స్‌ న్యూరో విభాగం అదనపు ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజేష్‌ తెలిపారు. ప్రస్తుతం పార్కిన్‌సన్స్‌ వ్యాధిగ్రస్థులకు మాత్రమే డీబీఎస్‌ ఆపరేషన్‌ చేస్తున్నారని, ఇప్పుడు కేఆర్‌ఎస్‌కూ దీంతో పరిష్కారం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ వివరాలు అమెరికా నుంచి వెలువడే ‘మూమెంట్‌ డిజార్డర్స్‌’ ఆన్‌లైన్‌ సంచికలో తాజాగా ప్రచురితమయ్యాయి.

టఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరికి చెందిన ఓ యువకుడు (32) కొంతకాలంగా కేఆర్‌ఎస్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది పార్కిన్‌సన్స్‌ వ్యాధిని పోలి ఉంటుంది. జన్యుపరమైన సమస్యలే దీనికి కారణం. ఫలితంగా రోగుల్లో కాళ్లు, చేతులు, తల భాగంలో తీవ్రమైన వణుకు వస్తుంది. ఆహారం, నీళ్లు లాంటివి కూడా తీసుకోలేరు. దేశంలోనే తొలిసారిగా కేఆర్‌ఎస్‌ రోగికి డీబీఎస్‌ శస్త్రచికిత్స చేసి.. సమస్యను పరిష్కరించామని డాక్టర్‌ రాజేష్‌ వెల్లడించారు.’
న్యూరాలజీ వైద్యులు రూపం, రుక్మిణిల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగిందని డాక్టర్ రాజేష్ తెలిపారు. ‘శస్త్రచికిత్సలో భాగంగా వణుకుడు సమస్యకు కారణమైన మెదడులోని నాడులకు నిరంతరం విద్యుత్తు తరంగాలను అందిస్తారు. మెదడులో ఒక పరికరం ఏర్పాటు చేసి వాటికి వైర్లతో బయట బ్యాటరీని అనుసంధానం చేస్తారు. ఈ బ్యాటరీని ఛాతీ భాగంలో చర్మం కింద అమర్చుతారు. ప్రతి మూడేళ్లకొకసారి ఈ బ్యాటరీని మార్చుకోవాలని’ రాజేష్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news