72 ఏళ్ల భర్తను కిరోసిన్‌ పోసి నిప్పంటించిన వృద్ధురాలు

-

ఢిల్లీలో ఆస్తి కోసం ఓ వృద్ధురాలు తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. ఓ వృద్ధ దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా ఇల్లు అమ్మే విషయంలో గొడవ చెలరేగింది. అయితే భర్త నిద్రిస్తున్న సమయంలో అతని భార్య కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ దారుణం నవంబర్​ 21న జరగగా.. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని ఓ 72 ఏళ్ల వృద్ధుడిపై అతని భార్య కిరోసిన్​ పోసి నిప్పంటించింది. నార్త్​ వెస్ట్రన్​ జిల్లాలోని షాలీమార్​బాగ్​ ప్రాంతంలో ఓ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లోని పై భాగంలో వారి కుమారుడు, కోడలు ఉంటున్నారు. అయితే గత కొంత కాలంగా వారి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగేవి. వారికి ఉన్న ఇళ్లలో ఒకదాన్ని అమ్మి.. బల్లభ్​గడ్​ ప్రాంతంలో మరో ఆస్తిని కొనుగోలు చేశాడా వృద్ధుడు. కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తిని తన పేరున రిజిస్టర్​ చేయాలని అతని భార్య కోరింది. అందుకు నిరాకరించిన వృద్ధుడు తన పేరుపై ఆ ఆస్తిని రిజిస్టర్​ చేయించుకున్నాడు.

Fire Images - Free Download on Freepik

దీంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. నవంబర్​ 21వ తేదీన.. ఆ 70 ఏళ్ల వృద్ధురాలు స్థానికంగా జరిగే తన బంధువుల వివాహానికి హాజరై.. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తన ఇంటికి చేరుకుంది. పెళ్లి నుంచి వచ్చిన తర్వాత కూడా వారి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ వృద్ధురాలు పై ఇంట్లో ఉండే.. తన కొడుకు వద్దకు వెళ్లింది. ఆ వృద్ధుడు మాత్రం కింద ఇంట్లోనే నిద్రించాడు. అయితే భర్తపై ఉన్న కోపంతో అతను నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్​ పోసి నిప్పింటించిందా వృద్ధురాలు. దీంతో అతను గట్టిగా అరవగా పై ఇంట్లో ఉన్న కొడుకు, కోడలు కిందకు వచ్చి.. వృద్ధుడ్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడి శరీరం 85 శాతం కాలినందున మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు
సూచించారు. ఆ తర్వాత అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని వారి కుమారుడు తెలిపాడు. ప్రస్తుతం ఆ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉందని.. అదనపు డీసీపీ అపూర్వ గుప్తా తెలిపారు. వృద్ధుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతని భార్యపై.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news